తనపై జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బి.ఆర్. నాయుడు తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై నీచాతి నీచంగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, తన పాత ఫోటోలను మార్ఫింగ్ చేసి తప్పుడు వీడియోలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ముఖ్యంగా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, తనను రాజీనామా చేయమని అడగడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. తనకు ఎన్నో ఉన్నత అవకాశాలు వచ్చినా, కేవలం శ్రీవారికి సేవ చేయాలనే సంకల్పంతోనే ఈ బాధ్యతను స్వీకరించానని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను ఆపబట్టే మౌనంగా ఉన్నానని, లేకుంటే ప్రత్యర్థుల దుర్మార్గాలన్నీ ఎప్పుడో బయటపెట్టేవాడినని హెచ్చరించారు.
వీడియో లో వారు చూపిస్తున్న కుటుంబంతో తన కుటుంబానికి 30 ఏళ్లుగా పరిచయం ఉందని గుర్తు చేస్తూనే, భూమన కరుణాకర్ రెడ్డి వేషాలు తన దగ్గర సాగవని బి.ఆర్. నాయుడు స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వచ్చే సమయంలో హిందూ ధర్మం ప్రకారం సతీసమేతంగా ఎందుకు రావడం లేదని తాను ప్రశ్నించినందుకే, కక్ష గట్టి తనపై ఇటువంటి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
వైవీ సుబ్బారెడ్డి, భూమనలకు రాబోయే రోజుల్లో చుక్కలు చూపిస్తానని, గతంలో మద్రాస్కు వెళ్లి వారు ఏం చేశారో కూడా తనకు తెలుసని, అవన్నీ బయటపెట్టమంటారా అని సవాల్ విసిరారు. వన్ మెన్ కమిషన్ విచారణను డైవర్ట్ చేసేందుకే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని, తనపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా పోరాడతానని ఆయన వెల్లడించారు.
తాను ఈ ప్రాంతం వాడినని, నిస్వార్థంగా సేవ చేస్తున్నానని చెబుతూ, తన వల్ల టీటీడీకి ఒక్క చిన్న మచ్చ కూడా రాలేదని బి.ఆర్. నాయుడు పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను కాపాడి, వ్యవస్థను ప్రక్షాళన చేయడమే తన లక్ష్యమని, ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, తనపై రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
“నువ్వు దిగిపో అంటే దిగడానికి నేను ఇక్కడికి రాలేదు.. నా జోలికి వస్తే తోలు తీస్తా” అంటూ ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తనపై వస్తున్న పనికిమాలిన రాతలు, మాటలు కట్టిపెట్టాలని, క్రమశిక్షణ లేని వారి ఆటలు తన దగ్గర సాగవని ఆయన తేల్చి చెప్పారు.
