ఇరాన్ అణు సామర్థ్యాలను అణిచివేసే వరకు ఇజ్రాయెల్, అమెరికా దళాలు తమ సైనిక చర్యలను ఆపబోవని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ స్పష్టం చేశారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్ అణ్వాయుధ దేశంగా మారకుండా అడ్డుకోవడమే తమ ఉమ్మడి సైనిక ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని, దీనికోసం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడబోమని ప్రకటించారు.
అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు నిర్వహిస్తున్న ఈ మెరుపు దాడులతో ఇరాన్ పాలక వ్యవస్థ తీవ్ర నిరాశలో ఉందని, ఆ ఆవేదనలోనే ఇరాన్ ఎదురుదాడికి ప్రయత్నిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
ఇరాన్ అణు కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరుగుతాయా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రపంచ శాంతికి ముప్పుగా మారే అణు సామర్థ్యం టెహ్రాన్ చేతికి చిక్కకుండా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. అలాగే, ఇరాన్ ప్రజలకు అతి త్వరలోనే స్వేచ్ఛా వాయువులు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దక్షిణ ఇరాన్ పట్టణమైన మినాబ్లోని ఒక బాలికల ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిలో 160 మందికి పైగా మరణించారన్న వార్తలపై స్పందిస్తూ, ఈ మరణాలకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చేసిన తప్పిదాలే కారణమని తమకు నివేదికలు అందాయని డానన్ పేర్కొన్నారు.
పౌరుల మరణాల పట్ల విచారం వ్యక్తం చేస్తూనే, తమ దాడులు కేవలం సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అత్యంత ఖచ్చితత్వంతో జరుగుతున్నాయని ఆయన సమర్థించుకున్నారు. ఇరాన్ నాయకత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్లపై బురదజల్లుతోందని ఆయన ఆరోపించారు
.
