తిరుమల తిరుపతి దేవస్థానాల ఛైర్మన్ బీ ఆర్ నాయుడుపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు చెక్ పడింది. ఆయనపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై, ఫేక్ వార్తలపై హైదరాబాద్ కోర్టు కఠినంగా స్పందించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీ.ఆర్. నాయుడుపై ప్రసారం అవుతున్న తప్పుడు వార్తలు, మార్ఫింగ్ వీడియోలు, ఏఐ సాయంతో సృష్టించిన ఫేక్ కంటెంట్పై తక్షణ అడ్డుకట్ట వేయాలని ఆదేశిస్తూ న్యాయస్థానం గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది.
ఎలాంటి నిర్ధారణలేని ఆరోపణలు, దుష్ప్రచారం కలిగించే కథనాలు ఇకపై ప్రసారం చేయకూడదని స్పష్టంగా పేర్కొంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు సూచించింది. ఇప్పటికే ప్రచారంలో ఉన్న తప్పుడు కథనాలు, వీడియోలు, పోస్టులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలైన Google, Twitter, Instagram, Facebook, YouTube తదితర డిజిటల్ ప్లాట్ఫామ్లకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
సంబంధిత కంటెంట్ను తక్షణమే డౌన్ చేయాలని పేర్కొంది. తిరుమల వ్యవహారాలపై కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని పిటిషన్లో పేర్కొనగా, ప్రాథమికంగా పరిశీలించిన కోర్టు ఆరోపణల్లో తీవ్రత ఉన్నట్లు గుర్తించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ టెక్నాలజీ, మార్ఫింగ్ వీడియోలతో దుష్ప్రచారం సాగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రాజకీయ ఆరోపణలు కూడా వేడెక్కాయి. వైసీపీ అనుచరులు ఫేక్ వీడియోలతో విషప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమలపై కుట్రలో భాగంగానే టీటీడీ ఛైర్మన్పై దుష్ప్రచారం సాగుతోందని పిటిషనర్ వాదించినట్లు తెలుస్తోంది. కోర్టు ఉత్తర్వులతో ఫేక్ వార్తలకు తాత్కాలికంగా చెక్ పడినట్లైంది. మొత్తానికి, సోషల్ మీడియా వేదికల్లో నిర్ధారణలేని సమాచారాన్ని పంచుకోవడం చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని కోర్టు పరోక్షంగా హెచ్చరించింది.
