మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో LNG సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా భారతదేశానికి వచ్చే ఎక్కువ శాతం LPG మరియు LNG సరుకు రవాణా జరిగే హోర్ముజ్ జలసంధి మార్గంలో సరఫరా సమస్యలు తలెత్తే పరిస్థితి ఉండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టం, 1955 కింద నేచురల్ గ్యాస్ సరఫరాను నియంత్రించే ప్రత్యేక ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ “నేచురల్ గ్యాస్ (సప్లై రెగ్యులేషన్) ఆర్డర్, 2026” పేరుతో ఈ ఉత్తర్వును విడుదల చేసింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా LNG షిప్మెంట్లకు అంతరాయం ఏర్పడడంతో దేశవ్యాప్తంగా సహజ వాయువు ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హోర్ముజ్ జలసంధి ద్వారా వచ్చే LNG సరఫరాలు ప్రభావితమవుతున్నాయని కేంద్రం అంచనా వేసింది. ఇప్పటికే కొన్ని సరఫరాదారులు “ఫోర్స్ మేజర్” నిబంధనలను అమలు చేసినట్లు సమాచారం. దీనివల్ల దేశంలో కీలక రంగాలకు గ్యాస్ సరఫరా తగ్గే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో అవసరమైన రంగాలకు గ్యాస్ సరఫరా కొనసాగేందుకు కేంద్రం నాలుగు ప్రాధాన్యతా విభాగాలను నిర్ణయించింది.
ప్రాధాన్యతా విభాగం – I లో గృహాలకు సరఫరా అయ్యే పైప్ గ్యాస్ (PNG), వాహనాల కోసం ఉపయోగించే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), LPG ఉత్పత్తి మరియు పైప్లైన్ నిర్వహణకు అవసరమైన గ్యాస్ అవసరాలకు గత ఆరు నెలల సగటు వినియోగంలో 100 శాతం సరఫరా కొనసాగించేలా నిర్ణయించింది.
ప్రాధాన్యతా విభాగం – II లో ఎరువుల తయారీ కర్మాగారాలకు గత ఆరు నెలల సగటు వినియోగంలో కనీసం 70 శాతం గ్యాస్ అందించనున్నారు. అయితే ఈ గ్యాస్ను పూర్తిగా ఎరువుల తయారీకి మాత్రమే వినియోగించాలి. ఇందుకు సంబంధించి సంబంధిత యూనిట్లు ధృవీకరణను సమర్పించాల్సి ఉంటుంది.
ప్రాధాన్యతా విభాగం – III లో టీ తయారీ వంటి పరిశ్రమలు మరియు నేషనల్ గ్యాస్ గ్రిడ్కు అనుసంధానమైన ఇతర పరిశ్రమలకు గత ఆరు నెలల సగటు వినియోగంలో సుమారు 80 శాతం గ్యాస్ సరఫరా చేయనున్నారు.
ప్రాధాన్యతా విభాగం – IV లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా గ్యాస్ పొందే వాణిజ్య మరియు పారిశ్రామిక వినియోగదారులకు కూడా సుమారు 80 శాతం వరకు గ్యాస్ అందించనున్నారు.
అత్యవసర రంగాలకు సరఫరా కొనసాగించేందుకు కొన్ని ప్రాధాన్యం లేని రంగాలకు గ్యాస్ సరఫరాను తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెట్రోకెమికల్ యూనిట్లు, అధిక ఒత్తిడి మరియు అధిక ఉష్ణోగ్రత వద్ద గ్యాస్ వినియోగించే పరిశ్రమలు మొదటగా కోతలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అవసరమైతే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కూడా సరఫరా తగ్గించవచ్చు.
అదే విధంగా ఆయిల్ రిఫైనరీలు గత ఆరు నెలల సగటు వినియోగంతో పోలిస్తే సుమారు 65 శాతం వరకు గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది.
ఈ వ్యవస్థ అమలు బాధ్యతను గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL)కు అప్పగించారు. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC)తో కలిసి గ్యాస్ సరఫరా మార్పులను సమన్వయం చేస్తుంది. ప్రాధాన్యం లేని రంగాల నుంచి మళ్లించిన గ్యాస్కు ఒక సమిష్టి ధరను PPAC ప్రకటిస్తుంది.
మళ్లించిన గ్యాస్ను అందుకునే సంస్థలు ఆ ధరను అంగీకరిస్తూ అండర్టేకింగ్ ఇవ్వాలి. అలాగే ఆ గ్యాస్ను తిరిగి విక్రయించరాదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది.
దేశంలో సహజ వాయువు ఉత్పత్తి, దిగుమతి, మార్కెటింగ్ మరియు రవాణాలో పాల్గొనే అన్ని సంస్థలు—ONGC, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆయిల్ ఇండియా, వేదాంత, GAIL, LNG టెర్మినల్ ఆపరేటర్లు, పైప్లైన్ సంస్థలు మరియు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కొత్త సరఫరా షెడ్యూల్లను తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది.
ఇప్పటికే ఉన్న గ్యాస్ సరఫరా ఒప్పందాలు లేదా వాణిజ్య ఒప్పందాలకు ఈ ఉత్తర్వు విరుద్ధంగా ఉంటే ఈ కొత్త ఉత్తర్వే ప్రాముఖ్యత కలిగి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదనంగా, సహజ వాయువు, LNG లేదా రీగ్యాసిఫైడ్ LNGతో సంబంధం ఉన్న అన్ని సంస్థలు తమ ఉత్పత్తి, దిగుమతులు, నిల్వలు, సరఫరా మరియు వినియోగ వివరాలను PPAC ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.
ఈ ఉత్తర్వు అధికారిక గెజిట్లో ప్రచురితమైన వెంటనే అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
