ఆన్లైన్ వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ పొజిటిషన్లో దూసుకుపోతోంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అభివృద్ధి చేసిన నెక్ట్స్ జెన్.. ఈ-హాస్పిటల్ ఆన్లైన్ అప్లికేషన్ని రాష్ట్రంలో సమర్ధంగా వినియోగిస్తున్నారని ఎన్ఐసీ ప్రతినిధులు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ఏపీలో 6 కోట్ల 17 లక్షల మంది ఔట్ పేషెంట్.. కోటి 82 లక్షల ఇన్ పేషంట్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. 4 కోట్ల 88 లక్షల ల్యాబ్ పరీక్షల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
ఈ-హాస్పిటల్ వెబ్ అప్లికేషన్లో పక్కాగా వివరాలు నమోదు చేసుకొంటే.. దేశంలో ఎక్కడికి వెళ్లినా.. ఆయుష్మాన్ భారత్ ఐడీ ఆధారంగా వైద్య సేవలు పొందవచ్చు. పేషంట్కి సంబంధించిన అన్ని వివరాలు.. హెల్త్ హిస్టరీ ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. ఆసుపత్రి మారినా, డాక్టర్లు మారినా.. మళ్లీ అన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం లేకుండా.. అందుబాటులో ఉన్న వివరాలతో వైద్యం అందించవచ్చు.
నెక్ట్స్ జెన్ ఈ-హాస్పిటల్ అప్లికేషన్ ద్వారా వైద్య సిబ్బందిలో బాధత్య, జవాబుదారీతనం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది హాజరు నమోదు చేస్తున్నారు. డాక్టర్లు, సహాయ సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు ఆన్లైన్లోనే సమీక్షించే అవకాశం దొరికింది.
ఏపీ ప్రభుత్వం మెడికల్ రికార్డులను డిజిటలైజ్ చేయడానికి సంజీవని పథకాన్ని తీసుకొచ్చింది. ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఆన్లైన్లో హెల్త్ హిస్టరీ అందుబాటులో ఉంటే.. అత్యవసర సమయాల్లో సరైన వైద్యం అందించవచ్చు. అందుకే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన హెల్త్ ప్రొఫైల్స్తో డిజిటల్ డేటాబేస్ తయారు చేస్తోంది.
