కడప జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా మారిన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) అశోక్ రెడ్డిపై ప్రభుత్వం వేటు వేసింది. ఆయనపై వస్తున్న వరుస అవినీతి ఆరోపణలు, అక్రమాలపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు, ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలోని పలు కీలక పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు నిర్వహించిన అశోక్ రెడ్డిపై అనేక తీవ్రమైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా భూ సెటిల్మెంట్లు చేయడం, అధికార పార్టీ అండతో అక్రమాలకు పాల్పడటం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వీటన్నింటికీ మించి, టీడీపీ నేత బీటెక్ రవి కిడ్నాప్ వ్యవహారంలో అశోక్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు అప్పట్లో రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి. ఈ ఘటనపై పోలీసు శాఖ అంతర్గత విచారణను కూడా ఎదుర్కొంది.
వాస్తవానికి గత రెండేళ్లుగా అశోక్ రెడ్డి ఎటువంటి పోస్టింగ్ లేకుండా వెయిటింగ్ (VR) లోనే కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసులను తిరగదోడటంతో, ఆయన అక్రమాలకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా డిఐజి ఈ సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య జిల్లా పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
