అమరావతి రాజధాని పరిధిలో కీలకమైన అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ను సిబ్బంది కొరత వేధిస్తోంది. రాజధానిలో కీలకమైన ప్రాజెక్టులు చేపడుతున్న ఈ కార్పొరేషన్లో ఎమ్డి ఎస్.వి.ఆర్.శ్రీనివాస్తో పాటు మరో ముగ్గురు మాత్రమే సిబ్బంది ఉన్నారు.
వారు కూడా పిఎస్, ఎకౌంట్స్ అసిస్టెంట్, మరోకరు మాత్రమే విధుల్లో ఉన్నారు. అమరావతి పరిధిలో చేపట్టే అన్ని కీలక ప్రాజెక్టులను దీని పరిధిలోకే తెచ్చారు. రెండోదశ ల్యాండ్ పూలింగు ఏరియాలో అభివృద్ధి, ఎయిర్పోర్టు, రివర్ఫ్రంట్, కొత్తగా అమరావతి ఐ వంటి ప్రాజెక్టులతోపాటు ప్రస్తుతం జరుగుతున్న పనులను కూడా ఎజిఐసిఎల్ పరిధిలోకి తీసుకొచ్చారు.
అయితే ఎజిఐసిఎల్ ఏర్పాటు చేసిన తరువాత అవసరాల కోసం 13 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చారు. ఇవి కాకుండా కిందిస్థాయి పోస్టులు వందల్లోనే ఉన్నాయి. అయినా వాటిని భర్తీ చేయడంలో శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఎజిఐసిఎల్ను పట్టణాభివృద్దిశాఖలో ప్రత్యేక విభాగంగా గుర్తించారు.
రెరా, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తరహాలోనే ఎజిఐసిఎల్ కూడా స్వతంత్ర సంస్థగా ఏర్పాటు అయ్యింది. ఈ నేపథ్యంలో సిబ్బంది లేకపోవడంతో ఆ భారమంతా ఇతర విభాగాలపై పడుతోంది. ప్రస్తుతం ఎమ్డికి సహకరించేందుకు ఒక పిఎస్ మాత్రమే ఉన్నారు. అలాగే ఎకౌంట్స్ చూసేందుకు మరోకు ఉద్యోగినిని నియమించారు. వీరు కాకుండా సహాయకులు మరొకరు ఉన్నారు.
అయితే ఇంతపెద్ద ఎత్తున పనులు నిర్వహించాల్సిన సంస్థకు అవసరమైన అఫీసు నిర్వహణా సిబ్బంది, ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారుల నియామకంలో జాప్యం వల్ల పనిఒత్తిడి పెరిగిపోతోంది. దీనిపై ప్రభుత్వం స్పందించి వెంటనే ఎజిఐసిఎల్లో సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉంది.
