మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలోని మసీదులలో ఉన్న 180 మంది ఇమామ్, మౌజన్, హఫీస్ లకు రంజాన్ తోఫాను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంను పట్టణంలోని జామీయా మసీదు వద్ద గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ పర్వదినాలు ఎంతో ప్రాముఖ్యమైనవని, ఉపవాస దీక్ష అనేది కేవలం అల్లా అనుగ్రహం కోసమే కాదని, సమాజంలో సోదర భావం, ఐకమత్యం, దయాగుణం, ప్రేమ పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నియోజకవర్గంలోని అన్ని మసీదులలో ఉన్న ఇమామ్, మౌజన్, హఫీస్ లకు రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
గత ఐదు సంవత్సరాల నుంచి మంత్రి నారా లోకేష్ సహకారంతో రంజాన్ తోఫా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ముస్లింలను పూర్తిగా విస్మరించడంతో పాటు వారిని ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ముస్లీం పెద్దలు పాల్గొన్నారు.
