ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే ఒకే ఒక్క కారణంగా నగర బహిష్కరణ చేయడం సాధ్యం కాదని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. స్థానిక రాజకీయ నాయకుడు సయీద్ అహ్మద్ అబ్దుల్ వాహిద్ చౌదరిపై ఏడాది కాలానికి విధించిన నగర బహిష్కరణ ఉత్తర్వులను న్యాయస్థానం రద్దు చేసింది.
న్యాయమూర్తి మాధవ్ జామ్దార్ గురువారం ఇచ్చిన తీర్పులో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించినందుకే చౌదరిపై బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడం ఆయన ప్రాథమిక హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, గౌరవప్రదంగా జీవించే హక్కులను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
చౌదరిపై నమోదైన కేసులను పరిశీలించిన న్యాయస్థానం, ఆయన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని మాత్రమే ఆరోపణలు ఉన్నాయని గుర్తించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనల్లో పాల్గొన్నారనే కారణం ఒక్కటే చూపించి బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడం చట్టబద్ధం కాదని బొంబాయి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
“కేవలం నినాదాలు చేశారనే కారణంతో బహిష్కరణ ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారు? ప్రజలకు ఇలాంటి నినాదాలు చేసే హక్కు లేదా? ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపే హక్కు ఎందుకు ఉండకూడదు?” అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది.
సయీద్ అహ్మద్ అబ్దుల్ వాహిద్ చౌదరి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది. చౌదరి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన నాయకుడని, తమ పార్టీ కార్యకర్తలతో కలిసి కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా పలు నిరసనలు చేపట్టిన తర్వాతే పోలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు.
అధికారుల అనుమతి లేకుండానే నిరసనలు నిర్వహించారని పోలీసులు వాదించారు. అయితే ఆ ఆందోళనల వల్ల ప్రజలకు హాని జరిగిందని లేదా శాంతిభద్రతలకు భంగం కలిగిందని చూపించే ఆధారాలు రికార్డులో లేవని న్యాయస్థానం పేర్కొంది. కేవలం నిరసనలు, ఆందోళనలు నిర్వహించారనే కారణంతోనే మహారాష్ట్ర పోలీసు చట్టం కింద బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడం సమంజసం కాదని స్పష్టం చేస్తూ ఆ ఉత్తర్వులను రద్దు చేసింది.
