ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ట్రామా మెడిసిన్ కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. శనివారం గచ్చిబౌలిలోని మెడికోవర్ హాస్పిటల్ ( Medicover Hospital) లోని బ్లూ ప్లానెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘ట్రామా & కాన్ఫ్లిక్ట్ మెడిసిన్’ (National Conference on Trauma and Conflict Medicare) పై SACTEM (సొసైటీ ఆఫ్ అక్యూట్ కేర్, ట్రామా & ఎమర్జెన్సీ మెడిసిన్) ఫౌండేషన్, మెడికవర్ హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సదస్సులో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రాణాపాయ పరిస్థితుల్లో వైద్యుల సత్వర నిర్ణయాలు, సాంకేతిక నైపుణ్యాలు ప్రాణాలను రక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అలాంటి సందర్భాల్లో వైద్యుల అంకితభావమే అత్యంత శక్తివంతమైన సాధనమని అన్నారు. హైదరాబాద్ నగరం సమాచార సాంకేతిక రంగంతో పాటు, అందుబాటు ధరల్లో సూపర్-స్పెషాలిటీ వైద్య సేవలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని గవర్నర్ ఈ సందర్భంగా తెలిపారు.
గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న ఈ జాతీయ సదస్సు వైద్య రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ట్రామా మరియు కాన్ఫ్లిక్ట్ మెడిసిన్ రంగాల్లో నిపుణులను తీర్చిదిద్దడం, క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు.
భారతదేశం మరియు విదేశాల నుండి నిపుణులు హాజరవడం సంతోషకరమని, ఈ జ్ఞాన మార్పిడి దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తుందని తెలిపారు. యువ వైద్యులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, తమను కేవలం వైద్యులుగా మాత్రమే కాకుండా సమాజ రక్షకులుగా భావించుకోవాలని సూచించారు.
వైద్యుల బాధ్యత చికిత్సకే పరిమితం కాకుండా, సురక్షితమైన , ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కూడా విస్తరించాలన్నారు. వైద్యుల సున్నితత్వం, సేవాభావమే ఆరోగ్య వ్యవస్థకు నిజమైన బలం అని పేర్కొన్నారు. చివరగా, మెడికవర్ హాస్పిటల్స్ బృందాన్ని అభినందించిన గవర్నర్, ఈ జాతీయ సదస్సు వైద్య రంగానికి నూతన దిశను, శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, SACTEM, Medicover Hospital ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
