అమరావతి విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంచనాలకు అందని రీతిలో సహకరిస్తోంది. తాజాగా అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దాదాపు రూ.2 వేల 534 కోట్లతో చేపట్టనున్న ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే DPRలు సిద్ధమవ్వగా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆమోదముద్ర వేశారు. 22.53 ఎకరాల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఉద్యోగుల కోసం నివాస సముదాయాలు నిర్మించనున్నారు. అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో అమరావతిని కదిలించడం ఇక ఎవరితరం కాదని తేల్చిచెప్పినట్లయింది.
ఇక, ఈ పరిణామం మాజీ ముఖ్యమంత్రి జగన్కు, వైసీపీ నేతలకు గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. అమరావతి ఒక గ్రాఫిక్ అని, అక్కడ ఏమీ జరగదని గత ఐదేళ్లుగా ప్రచారం చేసిన వైసీపీ మైండ్ బ్లాంక్ అయ్యేలా కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోంది. అమరావతిలో రాజధాని నిర్మాణం కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత మాత్రమే కాదు, కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్ అని ఈ నిర్ణయం ద్వారా స్పష్టమైంది.
నిజానికి ఢిల్లీ పల్స్ను పసిగట్టడంలో వైసీపీ అధిష్టానం పూర్తిగా ఫెయిలైంది. ఢిల్లీ పెద్దలతో తమకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, రాజధాని విషయంలో కేంద్రం మద్దతు తమకే ఉంటుందని వైసీపీ భావించింది. కానీ, HUDCO ద్వారా రూ.11 వేల కోట్ల రుణం ఇప్పించడమే కాకుండా, స్వయంగా సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి దిగడం ద్వారా మోదీ ప్రభుత్వం వైసీపీ ఆశలపై నీళ్లు చల్లింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ విషయంలో నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టును పట్టాలెక్కించడం, వైసీపీకి ఢిల్లీలో పట్టు కోల్పోయిందనడానికి నిదర్శనం.
అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా మార్చే ప్రక్రియలో భాగంగా పదెకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ను కూడా నిర్మిస్తామని HUDCO ప్రకటించడం విశేషం. ఒకవైపు టెక్నాలజీ హబ్గా, మరోవైపు పరిపాలనా కేంద్రంగా అమరావతి రూపురేఖలు మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఇక్కడ తన ఆఫీసులను నిర్మిస్తుండటంతో, భవిష్యత్తులో అమరావతి దేశంలోనే కీలకమైన నగరాల్లో ఒకటిగా నిలవబోతోంది. మోదీ ప్రభుత్వం చూపుతున్న దూకుడు చూస్తుంటే..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆపడం ఎవరి వల్ల కాదని అర్థమవుతోంది.
