నియోజకవర్గాల పునర్విభజన అర్ధం లేని చర్య అని కాంగ్రెస్ ఎంపి శశిధరూర్ అన్నారు. జనాభా నియంత్రణలో మంచి ఫలితాలు సాధించిన తమిళనాడు, కేరళ వంటి దక్షిణ రాష్ట్రాలు ఈ ప్రక్రియలో అన్యాయానికి గురవుతాయని ఆయన అన్నారు. మంచి పనితీరు కనబర్చిన రాష్ట్రాలపై భారం పడే విధంగా ఈ పునర్విభజన ఉండబోతుందని పేర్కొంటూ, ఇది సమాఖ్య వ్యవస్థపై దాడిగా ఆయన అభివర్ణించారు.
దేశ సమతుల్య అభివృద్ధిని దెబ్బతీసే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. లోక్సభ స్థానాల సంఖ్యను 850కి పెంచే ప్రతిపాదనపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సభ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, వ్యవస్థ సమర్థత దెబ్బతినవచ్చని అన్నారు. మరోవైపు రాజ్యసభ స్థానాల పెంపుపై ఎలాంటి ప్రతిపాదన లేకపోవడం వల్ల రెండు సభల మధ్య సమతుల్యత లోపించే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ద్విసభ్య వ్యవస్థలో సంస్థాగత అసమతుల్యతకు దారితీస్తుందని హెచ్చరించారు.
