ఇరాన్ తో యుద్ధం ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్ హౌస్ బయట మీడియాతో మాట్లాడిన ట్రంప్, అమెరికా, ఇరాన్ మధ్య వచ్చే వారాంతంలో తదుపరి చర్చలు జరగవచ్చని తెలిపారు. రెండు వారాల కాల్పుల విరమణను పొడిగించే అవకాశం ఉన్నప్పటికీ, అవసరం లేకపోవచ్చని, ఎందుకంటే ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
ఒకవేళ ఒప్పందం కుదిరి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో సంతకం జరిగితే, ఆ కార్యక్రమానికి తాను హాజరవుతానని కూడా తెలిపారు. తరువాత లాస్ వెగాస్లో మాట్లాడుతూ, ఈ యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందని ట్రంప్ మరింత స్పష్టం చేశారు. అయితే ఈ యుద్ధం అమెరికాలో ప్రజాదరణ పొందలేదని, ముఖ్యంగా కీలక మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇది రాజకీయంగా ట్రంప్కు సవాల్గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ఇరాన్పై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపి, ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడిని పెంచింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గిస్తూ, ఈ యుద్ధం కొనసాగితే ప్రపంచం మాంద్య అంచుల వరకు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఇక అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న రహస్య చర్చల్లో పురోగతి ఉందని మధ్యవర్తిత్వంలో పాల్గొంటున్న పాకిస్తాన్ వర్గాలు వెల్లడించాయి. త్వరలో జరిగే సమావేశంలో ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసే అవకాశముందని సమాచారం. ఆ తర్వాత అరవై రోజుల వ్యవధిలో సమగ్ర ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఇరు దేశాలు ప్రాథమికంగా ఒప్పందానికి అంగీకరిస్తున్నాయని, సాంకేతిక అంశాలు తరువాతి దశలో ఖరారు అవుతాయని వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కీలకంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
