రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇంధన కొరత పరిస్థితిని సమీక్షిస్తూ సమస్య పరిష్కారానికి నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి సమగ్ర వివరణ కోరారు.
అధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు స్పందిస్తూ ఈ రోజు సాయంత్రానికి రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి వివరించారు. ఉదయం డిస్పాచ్ సెంటర్ల నుంచి బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు సాయంత్రానికి రిటైల్ బంకులకు చేరుకుంటాయని తెలిపారు. సరఫరా వ్యవస్థలో ఎటువంటి అంతరాయం లేకుండా ఉండేందుకు అధికారులు, ఆయిల్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆయిల్ సరఫరా జరగేలా కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఆయిల్ డిస్పాచ్ సెంటర్లకు వెళ్లి పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించాలని సూచించారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి మూడు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు, మంత్రులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు.
మీడియా, సోషల్ మీడియాలో వెలువడుతున్న వార్తలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ట్యాంకర్లు ఆలస్యం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా జాప్యం ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ లేదా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఆయిల్ కంపెనీలు నిరంతరం పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
