తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిస్థితిని సమీక్షించారు. తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో, బయోట్రిమ్ వెనుక భాగంలో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు.
అగ్నిమాపక సిబ్బంది మరియు అటవీ శాఖ సమన్వయంతో మంటలను అదుపులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర సమాచారం సేకరించేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రాంతంలో కొనసాగుతున్న అగ్నిమాపక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, అగ్నిప్రమాదానికి కారణమైన వారిపై అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) నుంచి ఘటనపై నివేదిక కోరారు.
శేషాచలం అటవీ ప్రాంతం పర్యావరణపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం కావడంతో, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, మంటలు పూర్తిగా ఆర్పే వరకు చర్యలు కొనసాగించాలని ఆదేశించారు.
