అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించడం వల్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. నౌకా దిగ్బంధనాన్ని ఉపసంహరించుకునేది లేదని ట్రంప్ తేల్చి చెప్పడంతో ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో అమెరికాను ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ హెచ్చరించారు.
‘అతి త్వరలోనే శత్రువులపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం. అది వారిని తీవ్రంగా భయపెడుతుంది. అది వారి పక్కనే ఉంది. దాంతో వారికి గుండెపోటు కూడా రావొచ్చు’ అని ఇరానీ పేర్కొన్నారు. అయితే ఆ సరికొత్త ఆయుధం ఏంటనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్పై తమ దళాలు ఏడు క్షిపణులతో విరచుకుపడ్డాయని, దీంతో అది కొన్ని రోజుల పాటు కార్యకలాపాలు నిర్వహించలేకపోయిందని తెలిపారు.
నౌకా దిగ్బంధనాన్ని కొనసాగించి, ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచి శాంతి చర్చలకు తీసుకురావాలనే అమెరికా ప్రణాళిక ఫలించదని ఇరానీ అభిప్రాయపడ్డారు. అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్నప్పటికీ కొన్ని నౌకలు తమ పోర్టుల నుంచి వెళుతున్నాయని, మరికొన్ని గమ్య స్థానాలకు కూడా సురక్షితంగా చేరుకుంటున్నాయని పేర్కొన్నారు
