ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్.. ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకొంటున్నారు. స్వపక్షం, విపక్షం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. ఒక్క పత్రికా ప్రకటనతో ఆయన మీద పొగడ్తల వర్షం కురుస్తోంది. ఆ ప్రకటన ఆయన గురించి కాదు.. ప్రభుత్వం గురించి అంతకంటే కాదు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి.. పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధుల ఫోటోలతో.. ఏపీ విద్యా శాఖ పత్రికల ఫ్రంట్ పేజీలో ప్రకటన ఇచ్చింది.
ఇప్పటి వరకు కార్పొరేట్ స్కూల్స్లో చదివిన స్టూడెంట్స్ ఫోటోలు మాత్రమే పత్రికల్లో కనిపించేవి. కానీ చరిత్రలో మొదటిసారి.. గవర్నమెంట్ స్కూల్ విద్యార్ధుల ప్రతిభను ప్రతి ఒక్కరికీ చాటి చెప్పే బాధత్య తీసుకున్నారు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్. సామాన్యుల ప్రతిభకు, పేదల టాలెంట్కు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు దక్కేలా చేయడం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్న విద్యాశాఖను.. ఆ శాఖను నిర్వహిస్తున్న మంత్రి లోకేశ్ను పార్టీలు, వర్గాలకు అతీతంగా అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
నిజానికి లోకేశ్ వ్యక్తిగత ప్రశంసల కోసం ఈ ప్రకటన ఇవ్వలేదు. ఆయన లక్ష్యం 596 మార్కులు సాధించిన విద్యార్ధులు.. వారికి చదువు చెప్పిన ప్రభుత్వ పాఠశాలలు సగర్వంగా నిలబడేలా చేయడం. ఒక్క ప్రకటనతో ప్రభుత్వ విద్య అత్యున్నత ప్రమాణాలకు చేరుకొందని నిరూపించారు. గతిలేక గవర్నమెంట్ స్కూల్లో చేరే పరిస్థితిని మార్చి.. మంచి విద్య కోసం ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకొనేలా ప్రోత్సహించేందుకు మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రయత్నం ప్రశంసలు అందుకొంటోంది.
ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో ఇప్పటికీ యూనివర్శిటీ క్యాంపస్లు.. ప్రభుత్వ కాలేజీలకే విద్యార్ధులు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. గవర్నమెంట్ సీట్ రాకపోతేనే.. ప్రైవేటు యూనివర్శిటీలు, కాలేజీల వైపు చూస్తారు. పాఠశాల విద్యలో కూడా ఇలాంటి పరిస్థితి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు మంత్రి నారా లోకేశ్. ప్రైవేటు విద్యా సంస్థలకు తీసిపోని స్థాయిలో సర్కారీ బడుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి.. విద్యా ప్రమాణాలు మెరుగుపరచిన ఫలితం… ఈ ఏడాది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్లో కనిపించింది. కొత్త విద్యా సంవత్సరంలో స్కూల్ అడ్మిషన్స్లో ఈ రిజల్ట్స్ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది.
