పత్రికా స్వేచ్ఛ లో ప్రపంచవ్యాప్తంగా భారత్ ర్యాంకు ఏటికేడూ పడిపోతోంది. ఈ ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2026′ ర్యాంకింగ్స్లో భారత్ ర్యాంకు 157కు పడిపోయింది. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లు ఈ ర్యాంకింగ్లో ముందు వరుసలో ఉండటం గమనార్హం.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో పత్రికా స్వేచ్ఛ ఎంత ప్రమాదంలో ఉన్నదో ఈ పరిణామం తెలియజేస్తున్నదని మేధావులు అంటున్నారు. ఈ పరిస్థితికి మోడీ సర్కారు అనుసరిస్తున్న అణచివేత ధోరణి, కఠిన విధానాలే కారణమని చెప్తున్నారు. ప్రపంచ మీడియా స్వేచ్ఛను అంచనా వేసే సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) 2026 ఏడాదికి సంబంధించి ఈ తాజా సూచికను విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలకు ర్యాంకులను కేటాయించింది. ముఖ్యంగా ఐదు ప్రమాణాల ఆధారంగా తీసుకున్నారు. ఇందులో ఆర్థిక, చట్టపరమైన, భద్రతా పరిస్థితులు, రాజకీయ, సామాజిక వాతావరణం వంటివి ఉన్నాయి. గతేడాది భారత్ ర్యాంకు 151గా ఉండగా అది ఇప్పుడు ఆరు స్థానాలు దిగజారడం ఆందోళనకరం. నేపాల్ (87వ ర్యాంకు), మాల్దీవులు (108), శ్రీలంక (134), భూటాన్ (150), బంగ్లాదేశ్ (152), పాకిస్తాన్ (153)లు భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం.
ఇక ప్రపంచంలో అత్యుత్తమ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాలుగా నార్వే, నెదర్లాండ్స్, ఎస్టోనియాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ట్రంప్ పాలనలో అమెరికా స్థానం కూడా దిగజారింది. ఈ సారి ఏడు స్థానాలు పడిపోయిన అమెరికా 64వ స్థానానికి చేరింది.
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి పదవిలోకి వచ్చిన తర్వాత అమెరికాలోనూ ప్రెస్ ఫ్రీడమ్ తగ్గిందనే విరమ్శలు ఉన్నాయి. పత్రికా స్వేచ్ఛకు స్థానం ఇవ్వకుండా వాటిని నియంత్రించే ధోరణిని ట్రంప్ అనుసరిస్తున్నారనీ, అందుకే ఇక్కడ కఠిన పరిస్థితులు ఉన్నాయని మేధావులు చెప్తున్నారు. జర్నలిస్టులపై కేసులు, చట్టపరమైన చర్యలుపత్రికా స్వేచ్ఛను అంచనా వేసిన ఐదు ప్రమాణాల్లో చట్టపరమైన అంశం (లీగల్ ఇండికేటర్) అత్యంత క్షీణతను నమోదు చేసిందని నివేదిక పేర్కొంది.
ఇది ప్రపంచవ్యాప్తంగా జర్నలిజంపై క్రిమినల్ కేసులు, చట్టపరమైన చర్యలు పెరుగుతున్నాయనడానికి సంకేతమని వివరించింది. భారత్తో పాటు ఈజిప్ట్, ఇజ్రాయిల్, జార్జియా వంటి దేశాల్లో ఈ పరిస్థితి కనిపించిందని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశాల్లో కూడా చట్ట వ్యవస్థలను మీడియాను అణగదొక్కే ఆయుధాలుగా వాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
