హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఒక ఖైదీతో జైలు అధికారిణి ప్రేమలో పడ్డ విచిత్ర సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్లో ఓ జైలు అధికారిణి, హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించిన ఖైదీ మధ్య ప్రేమ వివాహంగా మారిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సత్నా సెంట్రల్ జైలులో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఫిరోజా ఖాతూన్, మాజీ ఖైదీ ధర్మేంద్ర సింగ్ను వివాహం చేసుకున్నారు.
ఇద్దరి పరిచయం జైలులోనే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఫిరోజా ఖాతూన్ వారెంట్ ఇన్చార్జ్గా విధులు నిర్వహిస్తున్న సమయంలో, 2007లో ఓ కార్పొరేటర్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ధర్మేంద్ర సింగ్ జైలులో ఉన్నాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, చివరకు వివాహ బంధానికి దారితీసింది.
మే 5న మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో వీరి వివాహం జరిగింది. సామాజిక విమర్శలు ఎదురుకాకుండా ఉండేందుకు ధర్మేంద్ర సింగ్ తన పేరును వివాహ ఆహ్వాన పత్రికల్లో మార్చినట్లు సమాచారం. వివాహ కార్యక్రమం వేద మంత్రోచ్చారణల మధ్య హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.
ఈ వివాహానికి ఫిరోజా ఖాతూన్ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభించలేదని తెలుస్తోంది. ఆమె ముస్లిం మతస్తురాలు. ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి హాజరు కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ్బహదూర్ మిశ్రా, ఆయన భార్య వివాహంలో కన్యాదానం నిర్వహించారు. బజరంగ్ దళ్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వివాహం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారితీసింది. జైలు పరిచయం ప్రేమగా మారడం, మతాంతర వివాహం, కుటుంబాల స్పందన వంటి అంశాలు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
