భారతదేశ తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ మేజర్ షిప్పింగ్ హబ్గా అవతరిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు మేజర్ పోర్టులు ఆపరేషన్లో ఉండగా, కొత్తగా మరో ఐదు పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో మూడు నౌకాశ్రయాలు… వచ్చే ఆరు నెలల్లోనే ప్రారంభం కానున్నాయి.
మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టులు 2026 డిసెంబర్ నుంచి 2027 మార్చి మధ్య కాలంలో ఆపరేషన్స్ ప్రారంభిస్తాయి. ఈ పోర్టుల్లో ఎగుమతులు, దిగుమతులు ప్రారంభమైతే.. రాష్ట్రంలో పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ ఒకేసారి 50 శాతం పెరుగుతుంది.
ప్రస్తుతం విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పోర్టుతో పాటు అక్కడికి సమీపంలో గంగవరం పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టులు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. వీటి కార్గో హ్యాడ్లింగ్ కెపాసిటీ ఏడాదికి 195 మిలియన్ టన్నులు. కొత్తగా నిర్మిస్తున్న 3 పోర్టులు ఆపరేషన్స్ ప్రారంభిస్తే.. ఏడాదికి సరుకుల ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ సామర్ధ్యం 286 మిలియన్ టన్నులకు చేరుకొంటుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం.. రాష్ట్రంలో మారిటైమ్ రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. బ్లూ ఎకానమీ డెవలప్మెంట్ కోసం గత రెండేళ్లలో పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేశారు. త్వరలో పూర్తికానున్న మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట పోర్టులతో పాటు.. కాకినాడ ఎస్ఈజెడ్ పోర్టు, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా వస్తున్న రాజయ్యపేట పోర్టు పనులు ప్రారంభ దశలో ఉన్నాయి.
వీటికి తోడు దుగరాజపట్నంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం స్పెషల్ పర్సస్ వెహికిల్ ఏర్పాటు చేసింది. 29 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఏడాదికి 1.2 మిలియన్ గ్రాస్ టన్నేజ్ సామర్ధ్యం కలిగిన నౌకలను ఇక్కడ నిర్మిస్తారు. ఈ షిప్ బిల్డింగ్ క్లస్టర్ పూర్తయితే తూర్పు తీరంలో ఏపీ అతిపెద్ద నౌకా నిర్మాణ హబ్గా అవతరిస్తుంది. పోర్టులు, షిప్ బిల్డింగ్ యూనిట్ల ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి మారిటైమ్ యూనివర్శిటీతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా 2028 నాటికి 5 వేల మంది మారిటైమ్ ప్రొఫెషనల్స్ని తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
