ప్రత్యేకంహోమ్

యుద్ధ నేపథ్యంలోనూ వడ్డీ రేట్లను మార్చని ఆర్బీఐ

#ReserveBankOfIndia

పశ్చిమాసియా యుధ్ధ వాతావరణ పరిస్థితుల్లో కూడా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) వరుసగా రెండోసారి కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, ఇంధన ధరల పెరుగుదల, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇది చాలా మంది ఆర్ధిక వేత్తలను కూడా ఆశ్చర్య పరుస్తున్నది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షను ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించిందని తెలిపారు. అలాగే విధాన దృక్పథాన్ని “తటస్థ” స్థితిలోనే ఉంచినట్లు వెల్లడించారు.

గత మూడు నెలలుగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ముడి చమురు సరఫరాలు దెబ్బతిన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగి, దిగుమతులపై ఆధారపడే భారతదేశం వంటి దేశాలపై ఆర్థిక, ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆర్‌బీఐ జాగ్రత్త వైఖరిని అవలంబించింది.

ఏప్రిల్ నెలలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి తగ్గి, ఆర్‌బీఐ మధ్యకాలిక లక్ష్యమైన 4 శాతానికి సమీపించింది. అయినప్పటికీ రానున్న నెలల్లో బలహీన రుతుపవనాల అవకాశాలు, ఇంధన ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.

ఇక రూపాయి విలువ కూడా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మే 20న అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 96.86 వద్ద ముగిసి చరిత్రాత్మక కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి విలువ సుమారు 7 శాతం తగ్గగా, ఫిబ్రవరి చివరలో ఇరాన్‌కు సంబంధించిన ప్రాంతీయ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 6 శాతం క్షీణించింది.

ఖరీదైన ముడి చమురు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న వాణిజ్య లోటు, బలపడుతున్న అమెరికా డాలర్ వంటి అంశాలు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు ఆసియాలో అత్యంత స్థిరమైన కరెన్సీలలో ఒకటిగా భావించిన రూపాయి ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలలో బలహీన ప్రదర్శన కనబరుస్తున్న వాటిలో ఒకటిగా మారింది.

గతంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎంపీసీ సిఫార్సుల మేరకు ఆర్‌బీఐ 2025 డిసెంబర్, 2026 ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో తలా 25 బేసిస్ పాయింట్లు, 2026 జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు రెపో రేటును తగ్గించింది. అలాగే 2025 అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 0.25 శాతానికి పడిపోవడం ద్వారా వినియోగదారుల ధరల సూచీ ప్రారంభమైనప్పటి నుంచి అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.

Related posts

అరకు లోయ లో కనిపించిన భూమి

Satyam News

పూర్ణా మార్కెట్ అగ్నిప్రమాద బాధితులకు పరిహారం

Satyam News

ఇళ్ల స్థలాల లబ్ధిదారులను తక్షణమే ప్రకటించాలి

Satyam News

అమరావతి ఖర్చుపై వైసీపీ ఫేక్ ప్రచారం… అసలు లెక్కలు ఇవే…!!

Satyam News

అమెరికా రాజీ యత్నాన్ని బూటకం అన్న ఇరాన్

Satyam News

మీ పట్ల ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉంది

Satyam News

Leave a Comment