విధ్వంస పాలన నుంచి వికాసం దిశగా, అస్థిరత నుంచి సుస్థిర పాలన దిశగా ఎన్డిఏ కూటమి 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి జూన్ 12వ తేదికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అప్పసాని రాజేష్ అన్నారు.
విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్రెడ్డి పాలనలో అస్థిరత, విధ్వంసాలతో విసిగివేసారిన ప్రజలు 2024 ఎన్నికలలో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించారని గుర్తు చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన రెండు సంవత్సరాలలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మన బిడ్డల భవిష్యత్తు దిశగా ఎన్డిఏ సుపరిపాలన సాగుతున్నదని ఆయన అన్నారు.
ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు వేదికలో ఇచ్చిన సూపర్ 6 వాగ్ధానాలన్నింటినీ అమలు చేయడమేకాక అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలనూ అమలు చేస్తున్నాం. అయినా వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నది.
గడిచిన రెండు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే తల్లికి వందనం ద్వారా ఎంత మంది పిల్లలు ఉన్నా ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇస్తామన్న హామీని అమలు చేస్తున్నాం. దీనిలో భాగంగా 67 లక్షల 27 వేల మంది పిల్లల కొరకు రూ.10,090 కోట్లను తల్లుల ఖాతాలలో జమచేయడం జరిగింది.
సామాజిక పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచాం. దివ్యాంగులకు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, కిడ్ని డయాలసిస్ పేషంట్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు, 85 శాతం నుంచి 100 శాతం డిజేబుల్ అయి బెడ్రిడన్ అయిన వారికి రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు పెన్షన్లను పెంచడం జరిగింది. 62 లక్షల 32 వేల మందికి రూ. 65 వేల కోట్ల పెన్షన్ మొత్తాన్ని ప్రజలకు అందించడం జరిగింది. భారతదేశంలోనే రూ. 4 వేల పెన్షన్ ఇస్తూ, 26 రకాల పెన్షన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
2024 దీపావళి పండగ నుంచి కోటి 50 లక్షల రేషన్ కార్డుదారులలో ఒక్కోక్కొ మహిళకు 3 సిలెండర్ల చొప్పున 4 కోట్ల 26 లక్షల గ్యాస్ సిలెండర్లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది.
269 అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5 లకే భోజన సౌకర్యాన్ని (9 కోట్ల 71 లక్షల మందికి) అందించే బృహత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. మత్స్యకారులకు రూ.15 వేల నుంచి రూ.20 వేలకు పెంచి, వేట లేని సమయంలో అందిస్తున్నాం. దీనిపై రూ.250 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10 వేల నుంచి 15 వేలకు పెంచి 2 లక్షల 90 వేల మంది ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్లు ఇవ్వడం జరిగింది.
నారా లోకేష్ ల 2023 జనవరి 23వ తేదిన ‘యువగళం’ పాదయాత్రను ప్రారంభించారు. 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రావడం జరిగింది. ఇది దేశంలో 25.3 శాతం గా ఉంది. ఇప్పటికే రూ.11 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలు క్లియర్ చేసి కేబినెట్లో కూడా ఆమోదించడం జరిగింది.
విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలను ఎకనామిక్ జోన్స్గా మÖడు ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయడం జరుగుతున్నది. రాయలసీమలో 52 సీట్లు ఉండగా 2019లో వైసీపీ పార్టీకి 49 సీట్లు ప్రజలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని గుర్తించిన ప్రజలు 2024 ఎన్నికలలో ఎన్డిఏ కూటమికి రాయలసీమలో 45 స్థానాలను కట్టబెట్టారు. ప్రజల నమ్మకాన్ని మేము నిటబెట్టుకుంటున్నాం. రాయలసీమను రూ.లక్ష కోట్లతో లార్జెస్ట్ హార్టికల్చర్ హబ్గా తీర్చి దిద్దుతున్నాం.
మెరుగ్గా సంక్షేమం… అభివృద్ధి
ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు గత కంటే మరింత మెరుగుగా కొనసాగిస్తూ అభివృద్ధి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం.
వైసీపీ పాలనలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుపడినా ఆ మూలాలు ఏపీలో దొరికేవి. ఎన్డిఏ ప్రభుత్వం వచ్చాక ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి గంజాయిని పూర్తిగా నిర్మూలించిన ఘనత మా ప్రభుత్వానిది. యువతను గంజాయి నుంచి విముక్తి చేయాలని దృఢసంకల్పంతో పని చేస్తున్నాం. తిరుపతిలో ఎన్డిఏలోని మÖడు పార్టీలు కలిసి సభ పెడుతున్నాం. 12వ తేదిన అమరావతిలో సుపరిపాలన పేరిట సమావేశం ఏర్పాటు చేస్తున్నాం.
రకరకాల వాగ్ధానాలు చేసి 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో వెన్నుపోటుకు గురయ్యామని ప్రజలు భావించి 2024లో ఎన్డిఏకు ఏకోన్ముఖంగా అధికారం ఇచ్చారు. మద్యాన్ని నిషేధిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ మద్యం కుంభకోణం ద్వారా రూ. వేల కోట్లు దోపిడీ చేశారని విచారణలో తేలుతున్నది. ప్రజామోదం పొంది అధికారంలోకి వచ్చిన ఎన్డిఏ ప్రభుత్వాన్ని నెల తిరగక ముందే బర్తరఫ్ చేయాలని, ఢిల్లీలో జగన్మోహన్రెడ్డి చేసిన విన్యాసాలు చూశాం.. వైసీపీ దుష్ప్రచారాన్ని విజ్ఞత కలిగిన ఏపీ ప్రజలు నమ్మరు అని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తెలిపారు.
