క్వాంటం రంగంలో ఆంధ్రప్రదేశ్ మరో కీలక ఘట్టాన్ని ఆవిష్కరించింది. దేశ కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగురవేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన క్వాంటం వ్యాలీ దేశ క్వాంటం టెక్నాలజీ ప్రస్థానంలో సరికొత్త చరిత్రను సృష్టించింది.
అమరావతిలోని మేధా టవర్స్లో ఉన్న క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్లో అత్యంత శీతల ఉష్ణోగ్రత అయిన 4 కెల్విన్ (-269 డిగ్రీల సెల్సియస్) వాతావరణాన్ని విజయవంతంగా సృష్టించడం ద్వారా దేశీయ క్వాంటం పరిశోధనలకు కొత్త దిశను చూపించింది.
క్వాంటం కంప్యూటర్లు, సూపర్ కండక్టింగ్ పరికరాలు సమర్థవంతంగా పనిచేయాలంటే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం. ఈ అవసరాన్ని తీర్చేందుకు ఉపయోగించే కీలక పరికరమే డైల్యూషన్ రిఫ్రిజిరేటర్. ఇప్పటి వరకు ఇటువంటి అత్యాధునిక సాంకేతికత కోసం విదేశీ సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండగా, అమరావతిలో స్వదేశీ పరిజ్ఞానంతో ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడం భారత క్వాంటం రంగానికి పెద్ద విజయంగా భావిస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్లో మేధా టవర్స్, ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ప్రారంభించిన క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్లు ఏడాది కాలంలోనే విశేష పురోగతి సాధించాయి. క్యుబిట్ ఫోర్స్, క్యుబిటెక్ సంస్థల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన ఈ కేంద్రాలు క్రయోజెనిక్ సాంకేతికతలో దేశానికి కొత్త సామర్థ్యాలను అందిస్తున్నాయి.
ఈ ఫెసిలిటీ ద్వారా క్వాంటం చిప్స్, సూపర్కండక్టింగ్ పరికరాలు, క్వాంటం సెన్సార్లు, క్వాంటం కమ్యూనికేషన్ పరికరాలు, క్రయోజెనిక్ ఎలక్ట్రానిక్స్ వంటి అత్యాధునిక పరికరాల పరీక్షలు దేశీయంగానే నిర్వహించే అవకాశం లభించనుంది. దీంతో పరిశోధకులు, విద్యాసంస్థలు, జాతీయ ప్రయోగశాలలు, సాంకేతిక స్టార్టప్లకు అత్యంత ఆధునిక పరీక్షా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
క్వాంటం హార్డ్వేర్ టెస్టింగ్ రంగంలో అమరావతి ఇప్పుడు దేశంలో ప్రముఖ కేంద్రంగా ఎదుగుతోంది. భవిష్యత్తులో భారత క్వాంటం పరిశ్రమకు అవసరమైన పరికరాల్లో 85 శాతానికి పైగా స్థానికంగానే తయారు చేసే అవకాశాలకు ఈ అభివృద్ధి మార్గం సుగమం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాల సాధనలో అమరావతి కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో, ఈ క్వాంటం వ్యాలీ దేశాన్ని ప్రపంచ క్వాంటం శక్తిగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగుగా నిలిచింది. పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ రంగాలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ భారత క్వాంటం భవిష్యత్తుకు అమరావతి కేంద్ర బిందువుగా మారుతోంది.
