లెబనాన్ పై ఇజ్రాయెల్ ఏకపక్ష దాడులతో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ విరమణ చర్చలు వాయిదా పడ్డాయి. ఒక వైపు శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని హెజ్బొల్లా లక్ష్యాలపై శుక్రవారం భారీ వైమానిక దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో కనీసం 16 మంది మరణించగా, పలువురు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. దక్షిణ లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై రాత్రి పొడవునా పలు దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని హెజ్బొల్లా పదేపదే ఉల్లంఘిస్తోందని, అందుకే ప్రతిస్పందనగా ఈ చర్యలు తీసుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
అయితే, ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య శత్రుత్వ చర్యలు నిలిచిపోతాయని భావించినప్పటికీ, తాజా దాడులతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. లెబనాన్లోని పలు ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడినట్లు స్విట్జర్లాండ్ విదేశాంగ శాఖ ధృవీకరించింది. ఈ విషయంపై స్పందించిన స్విస్ అధికారులు, చర్చలు ప్రస్తుతం వాయిదా పడినప్పటికీ భవిష్యత్తులో వాటి నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య తాజా ఘర్షణలు, అలాగే అమెరికా-ఇరాన్ చర్చల వాయిదా నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో శాంతి ప్రయత్నాలకు మరోసారి సవాళ్లు ఎదురవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
