కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తన నిరాహార దీక్షను ముగించాడు. దీప్కే తో బాటు సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షకు సంఘీభావంగా నిరాహార దీక్ష చేస్తున్న వారందరూ కూడా దీక్ష విరమించారు.
గత నెలలో ఆత్మహత్య చేసుకున్న డెహ్రాడూన్కు చెందిన నీట్ పరీక్ష అభ్యర్థిని రియా తండ్రి చేతుల మీదుగా దిప్కే తన దీక్షను విరమించారు. సోనం వాంగ్చుక్ను జంతర్ మంతర్ నిరసన స్థలం నుంచి ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే కారణంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ పోలీసులు సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించిన అనంతరం, గత శనివారం అభిజీత్ దిప్కే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ సమయంలో తక్షణమే నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.
అయితే దిప్కే దీక్ష విరమించినప్పటికీ, సోనం వాంగ్చుక్ మాత్రం సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో తన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన చేతిరాత ప్రకటనలో మూడు షరతుల్లో ఏదో ఒకటి నెరవేరితేనే దీక్ష విరమిస్తానని స్పష్టం చేశారు.
ఇటీవలి విద్యా వ్యవస్థ వైఫల్యాలు, ముఖ్యంగా ప్రశ్నపత్రాల లీకేజీల అంశంపై ప్రభుత్వం బాధ్యత స్వీకరిస్తే జూలై 20న తన నిరాహార దీక్షను ముగిస్తానని వాంగ్చుక్ తెలిపారు. అలాగే తాను, కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం పార్లమెంట్ వద్దకు చేరుకుని, వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని హామీ ఇస్తే కూడా దీక్ష విరమిస్తానని పేర్కొన్నారు.
ఆరోగ్య పరిస్థితి కారణంగా తాను ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడితే, వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు ఆసుపత్రికి వచ్చి అదే హామీ ఇవ్వాలని ఆయన కోరారు. ప్రస్తుతం సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో తనను ఉంచడం అక్రమ నిర్బంధమని ఆరోపించిన వాంగ్చుక్, తన సంచార స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు అన్ని రకాల సమాచార మార్పిడిపైనా ఆంక్షలు విధించారని ఆరోపించారు.
