విశాఖపట్నం ఐటీ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్.. టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ వంటి భారీ కంపెనీలు వైజాగ్ వచ్చాయి. ఇదే బాటలో పదుల సంఖ్యలో చిన్న, మధ్య స్థాయి కంపెనీలు విశాఖలో ల్యాండ్ అవుతున్నాయి. డిసెంబర్ 12న ఒకే రోజు 10 ఐటీ కంపెనీలు ఓపెన్ అయ్యాయి. వీటిలో అతిపెద్దది కాగ్నిజెంట్ టెక్నాలజీస్. ఈ సంస్థకు కాపులుప్పాడలో 22 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ 1600 కోట్లతో ఏఐ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రంలో 8 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖమంత్రి నారా లోకేశ్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఇదే ప్రాంతంలో మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఫ్లూయెంట్ గ్రిడ్, ఇమాజినేటివ్ సంస్థలు ప్రారంభోత్సవం జరుపుకొన్నాయి. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీకి కాపులుప్పాడ ఐటీ పార్కులో 3.5 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ నిర్మించే క్యాంపస్లో ఆర్ అండ్ డీ సెంటర్తో పాటు జీసీసీని ఏర్పాటు చేస్తారు. ఫ్ల్యూయెంట్ గ్రిడ్కు 3.3 ఎకరాలు ఇచ్చారు. ఇమాజినేటివ్ సంస్థకు కేటాయించిన 4 ఎకరాల్లో అంతర్జాతీయ క్లయింట్స్ కోసం పని చేసే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటవుతుంది.
రుషికొండ సమీపంలోని ఐటీ హిల్ 4పైన సత్వాస్ వాంటేజ్ వైజాగ్ సెంటర్ను ప్రారంభించారు. ఇక్కడ సత్వ డెవలపర్ సంస్థకు 30 ఎకరాలు కేటాయించారు. ఈ కంపెనీ ఐటీ క్యాంపస్తో పాటు డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది. ఈ రెండు ఫెసిలిటీస్ ద్వారా స్థానికంగా 25 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. రుషికొండ ఐటీ హిల్ 2పైన తమ్మిన ఏఐ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు. ఈ సంస్థ 2 వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో ప్రారంభమైన ఈ కంపెనీలు.. రెండు మూడు సంవత్సరాల్లో కొత్త క్యాంపస్ల నిర్మాణం పూర్తి చేసుకొంటాయి. అంటే మరో మూడేళ్లలో విశాఖ ముఖ చిత్రం మారిపోవడం ఖాయం.
