కూటమి ప్రభుత్వం డగ్ర్స్పై తలపెట్టిన యుద్ధం రాష్ట్రాన్ని, యువతను మంచి దారిలో నడిపిస్తోందని రాష్ట్ర హోం మంత్రి అనిత తెలిపారు. గత 19 నెలల కాలంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు, ఈగల్ విభాగం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
గత ఏడాదిలో ఈగల్ విభాగం సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలపై రూపొందించిన వార్షిక నివేదికను ఈగల్ ఐజీ రవికృష్ణ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు. ఈ సందర్భంగా ఈగల్ సాధించిన విజయాలను ముఖ్యమంత్రి అభినందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని మంత్రి అనిత తెలిపారు.
ప్రత్యేకంగా “ఆపరేషన్ చైతన్యం” పేరుతో గంజాయి సాగు నిర్మూలనకు శాటిలైట్, డ్రోన్ల ద్వారా నిఘా పెట్టి, వేల ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసినట్లు వివరించారు. అలాగే గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే చర్యల ద్వారా సానుకూల ఫలితాలు సాధించామని చెప్పారు.
“ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్” కార్యక్రమం ద్వారా విద్యాసంస్థల పరిసరాల్లో డ్రగ్స్ విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, 47 వేలకుపైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా, విద్యాసంస్థల్లో 40 వేలకుపైగా ఈగల్ క్లబ్ల ఏర్పాటు, 35 వేలకుపైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా బాధితులకు సహాయం అందించడం వంటి పలు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.భవిష్యత్తులో “డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్” లక్ష్యంగా మరింత కృషి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి అనిత ఆదేశించారు.
