భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకలకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్రకు ‘గ్రోత్ ఇంజిన్’గా మారబోతోంది. తాజాగా ద హిందూ బిజినెస్ లైన్ ఇందుకు సంబంధించి ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
ఈ ఎయిర్పోర్ట్ విజయనగరం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అపారమైన అవకాశాలను సృష్టించనుంది. ఎయిర్పోర్టు చుట్టుపక్కల ఐటీ పార్కులు, సర్వీస్ సెక్టార్ యూనిట్లు, భారీ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం ఇప్పటికే ల్యాండ్ బ్యాంక్లను గుర్తించింది. కేవలం విమానాశ్రయం లోపలే కాకుండా, దాని అనుబంధ రంగాల ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం విజయనగరం నుంచి భోగాపురం వరకు ప్రత్యేక రహదారిని నిర్మిస్తున్నారు. దీనివల్ల రవాణా రంగం పుంజుకోవడమే కాకుండా.. లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ రంగాల్లో స్థానికులకు కొత్త వ్యాపార అవకాశాలు దక్కనున్నాయి. ఐటీ క్లస్టర్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతుండటంతో, సాఫ్ట్వేర్ నిపుణులు సొంత జిల్లాలోనే ఉపాధి పొందే అవకాశం లభించనుంది.
విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కనుంది. తీర ప్రాంతంలో రిసార్టులు, హోటళ్లు, ఇతర వినోద కేంద్రాల ఏర్పాటు ద్వారా స్థానిక మహిళలు, యువతకు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా, గన్నవరం వంటి పట్టణాల తరహాలో ఇక్కడ కూడా సర్వీస్ సెక్టార్ విస్తరించనుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు 2026 జూన్-జూలై నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం మౌలిక సదుపాయం మాత్రమే కాదు, ఇది ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల.
