హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీని ‘స్నేహ సంబంధాల వారధి’ గా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారతదేశం తన అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి బహుళ పక్ష ప్రతినిధి బృందాలను విదేశాలకు పంపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే లోక్సభ స్పీకర్ 64 దేశాలతో పార్లమెంటరీ ‘ఫ్రెండ్షిప్ గ్రూపులు’ ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 30 గ్రూపులకు బీజేపీ నాయకులు నేతృత్వం వహించగా, 28 గ్రూపులకు ప్రతిపక్ష ఎంపీలు అధ్యక్షత వహిస్తారు. వీరిలో 10 గ్రూపులకు కాంగ్రెస్ ఎంపీలు ఛైర్మన్లుగా ఉంటారు.
కాంగ్రెస్లో శశిధరూర్ (ఫ్రాన్స్), మనీష్ తివారీ (జపాన్), పి.చిదంబరం (ఇటలీ), కుమారి షెల్జా (మంగోలియా) గ్రూపులకు ఛైర్మన్లుగా నియమితులయ్యారు. ఇతర పార్టీల నేతల్లో అసదుద్దీన్ ఒవైసీ (ఓమన్), అభిషేక్ బెనర్జీ (అల్జీరియా), కణిమొళి (గ్రీస్), అఖిలేష్ యాదవ్ (ఆస్ట్రేలియా), సుప్రియా సూలే (సింగపూర్) గ్రూపులకు అధ్యక్షత వహిస్తారు.
సీనియర్ బీజేపీ నాయకుల్లో రవిశంకర్ ప్రసాద్ (ఇజ్రాయెల్), సుధాంసు త్రివేది (సౌదీ అరేబియా), వైజయంత్ పాండా (అమెరికా), నిషికాంత్ దూబే (రష్యా), జగదాంబికా పాల్ (మారిషస్), అనురాగ్ ఠాకూర్ (యూరోపియన్ యూనియన్) గ్రూపులకు నేతృత్వం వహిస్తున్నారు. అయితే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పేర్లు జాబితాలో లేవు.
లోక్సభ సెక్రటేరియట్ వర్గాల ప్రకారం, చట్టబద్ధ పదవులు నిర్వహిస్తున్న ప్రతిపక్ష నేతలను సంప్రదాయంగా ఈ గ్రూపుల్లో చేర్చరు. ఈ ఫ్రెండ్షిప్ గ్రూపులు సంభాషణలు, అధ్యయన పర్యటనలు, సంయుక్త చర్చల ద్వారా నిర్మిత మార్పిడి వ్యవస్థను ప్రోత్సహిస్తాయని, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా దీర్ఘకాలిక సహకారాన్ని కొనసాగించడంలో ఇవి సహాయపడతాయని సెక్రటేరియట్ తెలిపింది.
చైనా, పాకిస్తాన్ దేశాలు తొలి విడత గ్రూపుల్లో లేవు. అయితే భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక, భూటాన్, మాల్దీవులు, నేపాల్తో పాటు జర్మనీ, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, వియత్నాం, మెక్సికో, ఇరాన్, యూఏఈ తదితర దేశాలతో ఈ గ్రూపులు ఏర్పాటు చేశారు.
ఈ ఫ్రెండ్షిప్ గ్రూపులు భారత ప్రజాస్వామ్య వైవిధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా, 64 దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని లోక్ సభ సెక్రటేరియట్ వెల్లడించింది.
