డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందని, ఇప్పటివరకు సుమారు 85 శాతం పూర్తి అయ్యిందని ఏపీ రాష్ట్రం విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం అన్నారు.ఈ మేరకు కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ , సర్ ప్రక్రియ పురోగతిని వివరించారు.
జిల్లాలో 15,78,949 మంది ఓటర్లు ఉండగా, వీరిలో ఇప్పటివరకు 13,25,000 మందికి డిజిటలైజేషన్ పూర్తి అయ్యిందని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్లో కొన్ని ఇబ్బందులు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల ఎవరైనా మిగిలిపోయి ఉంటే, డిజిటలైజేషన్ ను పూర్తి చేసేందుకు వెంటనే తమ బిఎల్ఓను సంప్రదించాలని సూచించారు.
ఈ నెల 14 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని, అందువల్ల ప్రజలు కూడా సిబ్బందికి తమవంతు సహారాన్ని అందించాలని కోరారు. ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి తమ ఆధార్ నంబరును నమోదు చేస్తే చాలని చెప్పారు.అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ ఓటుహక్కు కల్పించడం, డూప్లికేట్ ఓట్లను నివారించడం, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా సర్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించడం జరుగుతోందని చెప్పారు.
అందువల్ల ఓటర్లు తమ ఆధార్ సంఖ్యను కూడా నమోదు చేయాలని సూచించారు. అలాగే ఒక కుటుంబ సభ్యుల ఓట్లన్నీ ఒకే పోలింగ్ కేంద్రంలోకి రావాలంటే, తప్పనిసరిగా వారంతా ఒకే డోర్ నెంబరును నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒక ఇంటిలో ఎవరైనా సభ్యులు ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతానికి వలస వెళ్లిన పక్షంలో, వారి వివరాలను కుటుంబ సభ్యులు ఎవరైనా బిఎల్ఓలకు తెలియజేయవచ్చునని అన్నారు.
18 ఏళ్లు నిండినవారంతా కొత్తగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకొనేందుకు ఫారమ్ 6 ద్వారా ధరఖాస్తు చేయాలని సూచించారు. డిజిటలైజేన్ పూర్తి అయిన అనంతరం ఈ నెల 21న ముసాయిదా జాబితాను ప్రచురించడం జరుగుతుందన్నారు. దీనిపై అభ్యంతరాలను ఆగస్టు 20 వరకు స్వీకరించి, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 18 వరకు అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కారం అనంతరం సెప్టెంబరు 22న ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు.
ముసాయిదా జాబితాలో పేరు లేని ఓటర్లు, తమ బిఎల్ఓ లేదా తాహసీల్దార్, ఎంపిడిఓ, ఇఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించి తమ పేరును నమోదు చేసుకొనే అవకాశం ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.
