నారాయణ పేటను బాల్య వివాహా రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ నేటి నుంచి సంకల్పం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అన్నారు. జిల్లా అంటే అందమైన రోడ్లు, సుందరమైన భవనాలే కాదని, జిల్లాలో అక్షరాస్యత, బాలల హక్కులు, మహిళా చట్టాలు, సంపూర్ణంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.
గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్ గార్డెన్స్ లో జిల్లా మహిళాభివృద్ధి – శిశు సంక్షేమ సంక్షేమ శాఖ/ బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహా నిషేధ చట్టం 2006 , లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 పై నారాయణపేట ఐ సీ డీ ఎస్ ప్రాజెక్టు పరిధిలోని బాలల సంరక్షణ కమిటీ సభ్యులకు, ప్రజా ప్రతినిధులకు, సంబంధిత శాఖల అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నా భవిష్యత్తు – నా సంకల్పం
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డాక్టర్ వినీత్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నా భవిష్యత్తు – నా సంకల్పం అనే నినాదంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం సాదారణమైనది కాదని, ఇక నుంచి గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలోనూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
ఈ కార్యక్రమం ద్వారా మనం వేసే ప్రతీ అడుగు ఆడపిల్లందరూ చదువుకోవాలని, పెళ్ళీడు వచ్చాకే వివాహం చేసుకునేలా క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించడమే అని ఆమె స్పష్టం చేశారు. బాల్య వివాహాలు ఎక్కువ జరిగే జిల్లాగా మన జిల్లాకు పేరుందని, మనం సంకల్పించుకుంటే ఆ పేరును చెరిపేయవచ్చని అన్నారు. ఒకప్పుడు వితంతుల పెళ్లిళ్లు ఆశ్చర్యం కలిగించేలా ఉండేవని, కానీ ఇప్పుడు సాధారణం అయ్యాయని తెలిపారు.
కార్యక్రమానికి వచ్చిన వాళ్లందరూ బాల్య వివాహాలను నిరోధించే అధికారం ఉన్న వాళ్లే నని, న్యాయ, చట్ట పరంగా ప్రోహిబిషన్ అధికారులు అని అన్నారు. బాల్య వివాహాలను జరగక ముందే ఆపాలని, సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ బాల్య వివాహం జరిగిన విషయం చెప్పక పోయినా, బాల్య వివాహాన్ని ప్రోత్సహించినా.. రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో నేటికి ఇంకా చాలా గ్రామాల్లో ప్రజలకు బాల్య వివాహాల నిరోధక చట్టం గురించి తెలియదని, ఇకపై అన్ని గ్రామాల్లో చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. ఇది మొదటి కార్యక్రమం అని, జిల్లా అంతటా ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారన్నారు.
ఇక పై ఎక్కడైనా బాల్య వివాహం జరిగినట్లు రుజువైతే సంబంధిత క్షేత్ర స్థాయి అధికారి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ చెప్పారు. గ్రామాల్లో సర్పంచులు కూడా బాల్య వివాహాలను అరికట్టాలనీ ఆమె సూచించారు. జిల్లాలో ఈ సంవత్సరం ఏ గ్రామంలో అయితే ఒక్క బాల్య వివాహం జరగకుండా అడ్డుకున్న, అరికట్టిన సర్పంచులకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ సర్పంచి గా అవార్డు ఇప్పిస్తానని కలెక్టర్ సమావేశంలో ప్రకటించారు.
బాల్య వివాహాల నిర్మూలనకు జిల్లా విద్యా శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో డ్రాఫ్ అవుట్ పిల్లలు లేకుండా చూడాలని, అవసరమైతే ఉల్లాస్ కార్యక్రమం ద్వారా అయినా చదివించాలని, ఈ సంవత్సరం జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య జీరో గా డిక్లేర్ చేసి రాష్ట్రస్థాయిలో మన జిల్లా బాల్య వివాహా రహిత జిల్లాగా రికార్డు పొందాలని కలెక్టర్ పేర్కొన్నారు.
బాల్య వివాహాలు నేరం
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ.. బాల్య వివాహం నేరమని, 2006 లోనే చట్టం వచ్చిందని, చట్టం అమలులోకి వచ్చి ఇరవై ఏళ్ళు అవుతున్నా.. నెలకో కేసు నమోదు కావడం దురదృష్టకరం అన్నారు. సంప్రదాయ మార్పు రాకపోతే చట్టాలున్నా వృధా అని అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో బాల్య వివాహాలు చేస్తున్నారని, ఆడపిల్ల ను వేరే ఇంటికి తొందరగా పంపించాలనే ఆలోచన ధోరణి తల్లిదండ్రులలో మారాలని ఎస్పీ తెలిపారు.
డ్రాఫ్ అవుట్ అయిన ఆడపిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నారని, అందుకే డ్రాఫ్ అవుట్ పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని ఆయన సూచించారు. నిరుపేదలైన తల్లిదండ్రులకు ఉపాధి కల్పించాలన్నారు. జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ మిషన్ మోడ్ లో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా బాలల సంరక్షణ సలహాదారు డేవిడ్ రాజ్ (WCD విభాగం మరియు నల్సార్ విశ్వవిద్యాలయం) బాల్య వివాహా నిరోధక చట్టం, పోక్సో చట్టం గురించి అధికారులు, ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా క్లుప్తంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీ ఈ వో శ్రీనివాస్ రావు, డిఆర్డిఓ వెంకట్ రాములు, ఆర్డిఓ రమేష్, డీ డబ్ల్యు ఓ రాజేందర్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, సీడబ్లుసీ చైర్మన్ అశోక్ కుమార్,డీసీపీవో కరిష్మా, సీ డబ్ల్యు సీ కమిటీ సభ్యులు, తహాసిల్దారులు, ఎంపీడీవోలు, సిడిపిఓలు, సూపర్ వైజర్లు, ఎంపీ ఓలు, ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వీ సీ పీ సీ లు, డీ సీ పీ వో బృందం, అంగన్ వాడీ టీచర్లు పాల్గొన్నారు.
