ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఘోర నౌక ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు ప్రాణభయంతో సముద్రంలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యల్లో పలువురిని సురక్షితంగా రక్షించినప్పటికీ, ఇంకా 41 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం నౌకాదళం, కోస్ట్ గార్డ్, స్థానిక రక్షణ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
వీరంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన ఇండోనేషియా అధికారులు, నౌకలో మంటలు ఎలా చెలరేగాయనే అంశంపై విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
