‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది. దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఈ నిరసన కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ఉద్యమం ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
పరీక్షలు, నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని తమ సంస్థ డిమాండ్ చేస్తోందని, అయితే ఆ డిమాండ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం తమ సామాజిక మాధ్యమ కార్యకలాపాలపైనే దృష్టి సారిస్తోందని ఆరోపించారు.
శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించిన నిరసన కార్యక్రమంలో దిప్కే పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత హాజరైంది. సభలో ప్రసంగించిన దిప్కే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం నెల రోజులుగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
తమ ఖాతాలను హ్యాక్ చేయడం, పోస్టులను తొలగించడం వంటి చర్యలతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోస్టులను తొలగించవచ్చేమో గానీ ఉద్యమకారులను ప్రజా వేదికల నుంచి తొలగించలేరని వ్యాఖ్యానించారు.
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కూడా కొద్దిసేపట్లో నిరసనలో పాల్గొంటారని, తమ ఉద్యమానికి ఆయన మద్దతు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు దిప్కే చెప్పారు. ఆ రోజు ఉదయం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంకు చేరుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, విమానం దిగే క్షణాల ముందు తాను స్వేచ్ఛలో గడుపుతున్న చివరి క్షణాలుగా భావించానని అన్నారు. ఈ ఉద్యమం కోసం అవసరమైతే తన స్వేచ్ఛను కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
జైలు భయంతో చాలామంది రాజీ పడిపోయారని, కానీ ఈ దేశంలోని విద్యార్థులు, యువత మాత్రం అమ్ముడుపోలేదని ఆయన వ్యాఖ్యానించగా సభా ప్రాంగణం నినాదాలతో మార్మోగింది. ఈ నిరసన కార్యక్రమానికి వందలాది మంది హాజరయ్యారు. ముఖ్యంగా యువత, పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొందరు కాక్రోచ్ ముసుగులు ధరించి, చేతుల్లో పూలతో నిరసన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో కలిసి వచ్చిన పాఠశాల విద్యార్థులు కూడా కనిపించారు. యువ ఉద్యోగులు, కళాశాల విద్యార్థులు, పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.
