తెలంగాణ ఆర్థిక పరిస్థితికి సంబంధించి పూర్తిస్థాయి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ రాశారు. లేఖ ముఖ్యాంశాలు.
రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి.. గెలిచాక “రాష్ట్ర ఖజానా ఖాళీ” అంటూ తప్పించుకోవడంలో మతలబు ఏంటీ? ఒకవైపు ఖజానాలో నిధులు లేవని చెబుతూనే, కాంగ్రెస్ అధిష్టానం కోసం రూ. 1,000 కోట్లు ఇస్తామనడం వెనుక ఆంతర్యం ఏమిటి?
గత 12 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం రూ. 12 లక్షల కోట్లకు పైగా నిధులు, ప్రాజెక్టుల రూపంలో సాయం అందిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం.. వడ్డీ రహిత రుణాలు (SASCI) అందించినా, రాష్ట్రంలో కనీసం చిన్న పనులు కూడా జరగని దుస్థితి నెలకొంది.
అప్పులు లేకుండా ఒక్క రోజు కూడా పాలన సాగించలేని స్థితికి రాష్ట్రాన్ని తెచ్చింది ఎవరు? 2014లో మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని నేడు అప్పుల ఊబిలోకి నెట్టిన వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచాలి.
మార్చి 16న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు ముందే, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై ‘శ్వేత పత్రం’ (White Paper) విడుదల చేయాలని తెలంగాణ ప్రజల తరఫున మిమ్మల్ని కోరుతున్నాను.
