ముఖ్యంశాలుహోమ్

మొంథా తుఫాన్ నేపథ్యంలో సహకరించండి

#CBN2

మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సీఎం పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.

తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో ఉండి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రం వైపు కదులుతోందని తెలిపారు. ఈ రోజు రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎన్డీఏ శ్రేణులు చురుకుగా వ్యవహరించాలని సీఎం సూచించారు. పరిస్థితి తీవ్రతను బట్టి రియల్ టైంలోనే మొబైల్ ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపుతున్నామని వివరించారు. పంటలను మునగ నుంచి కాపాడే చర్యలు అధికారులు చేపట్టాలని సూచించారు.

ప్రాణనష్టాన్ని పూర్తిగా నివారించడమే కాక ఆస్తి నష్టాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎన్డీఏ కార్యకర్తలు స్వచ్ఛంద సేవకులుగా ముందుకు వచ్చి సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అవసరమైతే కేంద్ర సహాయాన్ని కూడా కోరుతామని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడి నష్టాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

సంక్షోభ సమయాల్లో ప్రజల చెంతనే ఉండాలని ఎన్డీఏ నేతలకు సూచించారు. తుఫాన్ సహాయక చర్యల్లో ప్రభుత్వ యంత్రాంగానికి ఎన్డీఏ పార్టీల శ్రేణులు సహకరించాలని అన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణిలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. తిత్లీ, హుద్‌హుద్ తుఫాన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేసి, ఈసారి కూడా ప్రభుత్వం అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినా యుద్ధప్రాతిపదికన తొలగించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని క్షేత్రస్థాయిలో మోహరించినట్లు వివరించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా వెనక్కి రప్పించామని, వారితో సమన్వయం కొనసాగించాలని సూచించారు.

ప్రతి గంటకు తుఫాన్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేడర్ అందరూ ప్రజలకు అండగా నిలబడి కూటమిని ఆదరించిన ప్రజల పక్కన ఉండాలని పిలుపునిచ్చారు. దాదాపు 39 నియోజకవర్గాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

Related posts

వనపర్తిలో లక్షల్లో అద్దె-వేలల్లో టాక్స్

Satyam News

భక్తులతో పోటెత్తిన పారుపెల్లి శ్రీ కాలభైరవ ఆలయం

Satyam News

సాకారమవుతున్న అమరావతి స్వప్నం

Satyam News

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Satyam News

ఇంటర్ విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

Satyam News

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News

Leave a Comment