విజయవాడను మహా నగరంగా విస్తరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సిటీని ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి 10 రెట్లు పెద్దగా చేయడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 8 మండలాల్లో సుమారు 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయనున్నారు. ప్రస్తుతం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విస్తీర్ణం కేవలం 61.9 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే ఒకేసారి విజయవాడ నగరం పదిరెట్లు పెరిగి.. మహానగరంగా మారుతుందన్న మాట.
గత మూడు దశాబ్దాల నుంచి విజయవాడ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకవైపు ఇబ్రహీంపట్నం.. మరోవైపు గన్నవరం.. ఇంకోవైపు కానూరు, పోరంకీ దాటి గంగూరు వరకు బెజవాడ సిటీ విస్తరించింది. కృష్ణా నదికి అవతల ఒడ్డున ఉన్న సీతానగరం, తాడేపల్లి.. విజయవాడ సిటీలో భాగంలా ఉన్నా.. ఆ ప్రాంతాలు గుంటూరు జిల్లాలో ఉండటంతో.. గ్రేటర్ పరిధిలోకి చేర్చడం లేదు.
2011 జనాభా లెక్కల ప్రకారం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జనాభా 10 లక్షల 34 వేలు. ఇప్పుడు గ్రేటర్లో విలీనం చేస్తున్న గ్రామాల్లో జనాభా 5 లక్షల 54 వేలు. మొత్తం 15 లక్షల 88 వేలు. అయితే ఇవి పదిహేనేళ్ల క్రిందటి లెక్కలు. ఈ దశాబ్దంన్నర కాలంలో బెజవాడకి ఏపీ రాజధాని వచ్చింది. సిటీ పాపులేషన్ వేగంగా పెరిగింది. ఇప్పుడు గ్రేటర్ విజయవాడలో జనాభా 30 లక్షలపైనే ఉండొచ్చనే అంచనాలున్నాయి. 2026 జనాభా లెక్కల సేకరణ పూర్తయి.. ఫైనల్ డేటా వస్తే.. అధికారికంగా.. బెజవాడలో ఎంత మంది ఉన్నారనే విషయంపై స్పష్టత వస్తుంది. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందుగానే.. సమీపంలోని మున్సిపాలిటీలు.. గ్రామాలను గ్రేటర్ విజయవాడలో విలీనం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
