భార్య లావుగా ఉందని, ఎక్కువ తింటున్నదని ఆమెను చంపేశాడొక భర్త. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లో ఈ సంఘటన జరిగింది. భద్రిపల్లె పద్మ, బద్రి పల్లి కిరణ్ లకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. భద్రిపల్లె కిరణ్ ముద్దనూరులోని వారి మామ ఇంటిలోనే ఉంటున్నాడు. ఏడు సంవత్సరాల కుమార్తె కూడా ఉంది.
అయితే భార్య లావుగా ఉందని, ఎక్కువ తిండి తింటుందని కిరణ్ భావించాడు. దీంతో భార్యని ఎలాగైనా చంపాలని భావించిన భద్రి పల్లి కిరణ్ నెట్లో సెర్చ్ చేసి 80 వేలు విలువచేసే విష పదార్థాన్ని తెప్పించాడు. భార్యను ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లోని కిరణ్ తల్లిదండ్రుల ఇంటికి గత నెల 26వ తేదీన తీసుకొచ్చాడు.
29వ తేదీ రాత్రి భార్యకి విషమిచ్చి, ఆమె పడిపోయాక దిండు అదిమిపట్టి ఊపిరాడకుండా చేశాడు. ఆ తర్వాత అతనికేమీ తెలియనట్లు భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. మృతురాలు తండ్రి ముద్దనూరు పట్టణానికి చెందిన బెంగుళూరు రాజకుల్లాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ విభూ కృష్ణ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసే రిమాండ్ కు పంపినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సిఐ కొండారెడ్డి , ఎస్సైలు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
