ఇండిగో విమానాలు నేడు కూడా ఎగరడం లేదు. కోర్టు ఆదేశాల మేరకు అమల్లోకి వచ్చిన రెండో దశ కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL), విశ్రాంతి నిబంధనల్లో తాత్కాలిక సడలింపులు పొందినప్పటికీ ఇండిగో యాజమాన్యం విమానాలు నడపడం లేదు. పైలట్ల కొరత కారణంగా ఇండిగో దేశవ్యాప్తంగా 400 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది. నాలుగు ప్రధాన విమానాశ్రయాలలో ఇదే పరిస్థితి కనిపించిందని వర్గాలు వెల్లడించాయి.
బెంగళూరు విమానాశ్రయంలో 124 విమానాలు 63 బయలుదేరేవి, 61 వచ్చేవి రద్దు కాగా, ముంబైలో మొత్తం 109 విమానాలు 51 బయలుదేరేవి, 58 వచ్చేవి రద్దయ్యాయి. ఢిల్లీ విమానాశ్రయంలో 106 విమానాలు (54 బయలుదేరేవి, 52 వచ్చేవి) రద్దయ్యాయని, హైదరాబాద్లో 66 విమానాలు రద్దైనట్టు అధికారులు తెలిపారు. పైలట్ల కొరత కారణంగా శుక్రవారం ఇండిగో 1,000 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.
మూడు రోజులపాటు నిశ్శబ్దంగా ఉన్న ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ శుక్రవారం ఓ వీడియో సందేశం విడుదల చేసి, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. శనివారం 1,000 కన్నా తక్కువ విమానాలు మాత్రమే నడుస్తాయని ఆయన తెలిపారు. శుక్రవారం విమాన నియంత్రక సంస్థ (DGCA) ఇండిగోకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
రాత్రి డ్యూటీ నిర్వచనాన్ని 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కాకుండా 12 గంటల నుండి 5 గంటల వరకు మార్చి ఉపశమనం ఇచ్చింది. అలాగే, పైలట్లు చేయగలిగే రాత్రివేళల ల్యాండింగ్ల సంఖ్యను రెండు నుండి ఆరు వరకు పెంచింది. అయితే ఈ నిర్ణయాలపై పైలట్ల సంఘం ALPA ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సడలింపులు నియంత్రణ సమానత్వాన్ని దెబ్బతీస్తున్నాయని, ప్రయాణికుల భద్రతను కూడా ప్రమాదంలో పడేస్తున్నాయని విమర్శించింది.
డిసెంబరు 5న నిర్వహించిన సమావేశంలో పైలట్ల సంఘం అభ్యంతరాలను పరిశీలించిన పౌర విమానయాన మంత్రిత్వశాఖ, సవరించిన FDTL నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై ALPA ఇండియా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కోర్టు నిర్ణయాలను విస్మరించడం సరైంది కాదని పేర్కొంది. పైలట్ల అలసట నివారణకు అవసరమైన రక్షణ చర్యలను ఆలస్యం చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది.
2024 జనవరిలో ప్రకటించిన కొత్త FDTL నిబంధనలను మొదటగా వ్యతిరేకించిన సంస్థ ఇండిగోనే. మార్చిలో అమలుకు రావాల్సిన ఈ నిబంధనలకు అదనపు సిబ్బంది అవసరం పడుతుందనే కారణంతో మరింత సమయం కావాలని ఇండిగో కోరింది. వారానికొకసారి 48 గంటల విరామం, రాత్రి సేవా సమయాల పెంపు, రాత్రివేళల ల్యాండింగ్లను రెండు వరకు మాత్రమే పరిమితం చేయడం వంటి నిబంధనలు ఇతర విమానయాన సంస్థలు కూడా మొదట్లో వ్యతిరేకించినప్పటికీ, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు DGCA దశలవారీగా వాటిని అమలు చేసింది.
జూలైలో మొదటి దశ అమల్లోకి వచ్చింది. నవంబర్ 1 నుంచి రెండో దశ అమలులోకి వచ్చింది, ఇందులో రాత్రివేళల ల్యాండింగ్ల సంఖ్యను ఆరు నుంచి రెండు వరకూ తగ్గించారు. 2024 మార్చిలో అమల్లోకి రావాల్సిన ఈ నిబంధనలు పైలట్ల కొరత, సంస్థల అభ్యంతరాలు, కోర్టు విచారణల నేపథ్యంలో ఆలస్యం అయ్యాయి. ఇప్పుడు వీటి అమలు నిలిపివేయడం, ఇండిగోలో పైలట్ల కొరత, భారీ విమాన రద్దుల అన్నీ కలిపి దేశీయ విమానయాన రంగాన్ని పెద్ద సంక్షోభంలోకి నెట్టాయి.
