రాజస్థాన్లోని జోథ్ పూర్ నగరంలో భారీ యాంటీ-టెరర్ ఆపరేషన్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ISIS కు సంబంధం ఉన్న ఓ హ్యాండ్లర్ను అరెస్ట్ చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడి మొబైల్ ఫోన్లో ఐసిస్కు సంబంధించిన అనుమానాస్పద వీడియోలు లభించాయి. సోషల్ మీడియా గ్రూపుల ద్వారా యువతను మోసగించి, తీవ్రవాద సిద్ధాంతాల వైపు మళ్లించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే జైలులో ఉన్న ఇతర ఐసిస్ అనుబంధ వ్యక్తులతో కూడా అతను సంబంధాలు కొనసాగించినట్లు విచారణలో వెల్లడైంది.
ఇంతకుముందు విజయవాడలో ఐసిస్ భావజాలంతో సంబంధం ఉన్న మరో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని విచారణలో జోధ్పూర్లోని నై సడక్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల జీషాన్ పేరు బయటపడింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన విజయవాడ పోలీసుల బృందం మంగళవారం సాయంత్రం జోధ్పూర్ చేరుకుని, సాదర్ బజార్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి రాత్రి ఆలస్యంగా జీషాన్ను అదుపులోకి తీసుకుంది. ఈ ఆపరేషన్కు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మానక్ రామ్ నేతృత్వం వహించారు.
నిందితుడు చాలా తెలివిగా వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టుకు ముందు అతను తన మొబైల్లోని తీవ్రవాద వీడియోలు, దేశ వ్యతిరేక కంటెంట్ను డిలీట్ చేసినప్పటికీ, ఫోరెన్సిక్ బృందం వాటిని తిరిగి రికవర్ చేయడంలో విజయం సాధించింది.
దర్యాప్తులో అతను “BENX” అనే సోషల్ మీడియా గ్రూప్కు అడ్మిన్గా పనిచేసినట్లు తేలింది. ఈ గ్రూప్లో అతను తరచుగా తీవ్రవాద భావజాలాన్ని ప్రోత్సహించే చిన్న వీడియోలు, వాయిస్ నోట్స్ షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం, హ్యాండ్లర్ అతన్ని ముందుగా పరీక్షించి, ఆ పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత గ్రూప్ అడ్మిన్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అతను ఇతర యువతపై ప్రభావం చూపుతూ వారిని తీవ్రవాద వైపు మళ్లించే ప్రయత్నాలు కొనసాగించాడు.
ఇప్పటివరకు జరిగిన విచారణలో నిందితుడు పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించకపోయినా, దాదాపు రెండేళ్లుగా ఈ నెట్వర్క్తో అతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా విచారణ కొనసాగుతుండగా, మరిన్ని కీలక వ్యక్తుల పేర్లు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇదే సమయంలో, విజయవాడలో అతని సహచరుడు అరెస్ట్ అయిన వెంటనే జీషాన్ ఆ గ్రూప్ నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ గ్రూప్లో సిరియా సహా ఇతర దేశాలకు చెందిన తీవ్రవాద అనుబంధ వ్యక్తులు కూడా ఉండే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు.
జోధ్పూర్లోని నై సడక్ ప్రాంతంలోని సో జైటీ గేట్ సమీపంలో నివసిస్తున్న నిందితుడి నివాస భవనం కొన్ని నెలల క్రితం కూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తూ, అంతర్జాతీయ నెట్వర్క్పై కూడా దృష్టి సారించారు.
