ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు తప్పడం లేదు. ఎన్నికల్లో ఘోర పరాజయం, ఇప్పటికే అనేక కేసులతో సతమతమవుతున్న జగన్కు..తాజాగా ఆయన తల్లి విజయమ్మ విడుదల చేసిన బహిరంగ లేఖ కోలుకోలేని దెబ్బగా మారింది. రాజకీయంగా ఇమేజ్ డ్యామేజ్ దెబ్బతినడమే కాదు…నైతికంగా జగన్ కూడా ఇప్పుడు డిఫెన్స్లో పడ్డారు. సొంత తల్లి, చెల్లితో ఆస్తుల వివాదం కోర్టుకు చేరడం, విజయమ్మ నోటరీ ద్వారా అసలు నిజాలను బయటపెట్టడంతో… జగన్ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
విజయమ్మ లేఖలోని అంశాలు జగన్ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నాయి. అవి జగన్ కష్టార్జితం కాదు.. ఫ్యామిలీ ఆస్తులని విజయమ్మ స్పష్టం చేయడం ద్వారా, ఇప్పటి వరకు వైసీపీ నేతలు చేస్తున్న వాదనలన్నీ తప్పని తేలిపోయింది. ముఖ్యంగా, రాజకీయ విభేదాల కారణంగా చెల్లిపై ఉన్న ప్రేమ పోయిందని, అందుకే ఆస్తుల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నానని జగన్ కోర్టుకెళ్లడం సామాన్య ప్రజల్లోకి నెగటివ్ సిగ్నల్స్ పంపింది. ఒకవైపు తల్లిపై గౌరవం ఉందని చెబుతూనే, మరోవైపు ఆమె పేరు మీద ఉన్న వాటాల బదలాయింపును అడ్డుకుంటూ NCLATలో పిటిషన్ వేయడం జగన్ డబుల్ స్టాండర్డ్స్ను తెలియజేస్తున్నాయి.
విజయమ్మ తన లేఖతో జగన్ ప్రత్యర్థులకు మరింత బలాన్ని అందించింది. సొంత తల్లికి, చెల్లికి, మేనల్లుడు, మేనకోడళ్లకు న్యాయం చేయని వ్యక్తి..రేపు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. గతంలో వైఎస్సార్ను ఆరాధించిన అభిమానులు కూడా ఈ ఆస్తుల గొడవ చూసి షాక్ అవుతున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అనే వ్యక్తి..తన కుటుంబ సభ్యులకే హక్కుగా రావాల్సిన ఆస్తుల విషయంలో కోర్టుల చుట్టూ తిరగడం జగన్ ఇమేజ్ను పాతాళానికి పడిపోయేలా చేసింది.
ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ చేయాల్సిన పని..ఈ వివాదాన్ని కోర్టుల బయట, కుటుంబ పరిధిలోనే పరిష్కరించుకోవడం. రాజకీయ విభేదాలను ఆస్తుల పంపకంతో ముడిపెట్టకుండా, తండ్రి ఆశయం ప్రకారం తన నలుగురు మనవలకు సమాన వాటాలు ఇచ్చి జగన్ పెద్ద మనసు చాటుకోవాలి. తల్లి విజయమ్మ కోరినట్టు, అసత్య ప్రచారాలకు స్వస్తి పలికి, కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడమే ఇప్పుడు జగన్ ముందున్న ఏకైక మార్గం.
