టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఏపీ రాజధాని అమరావతికి వస్తున్నారు. జనవరి 9న రాష్ట్రానికి వస్తున్న ధోనీ.. రెండు రోజుల పాటు ఏపీలో పర్యటిస్తారు. ఈ టూర్లో ఏపీ సీఎం చంద్రబాబుతో ధోనీ మీటింగ్ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో నవ నగరాలను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్ చేశారు. ఇందులో స్పోర్ట్స్ సిటీ ఒకటి. రాజధాని కోసం కొత్తగా సేకరిస్తున్న భూమిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఇతర క్రీడల మౌలిక వసతులతో స్పోర్ట్స్ విలేజ్ నిర్మించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే మాజీ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో అమరావతిలో క్రికెట్ అకాడమీ నిర్మాణం జరుగుతోంది. ఎంఎస్ ధోనీ కూడా క్రికెట్ అకాడమీ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారట. అమరావతిలో అకాడమీ ఏర్పాటు చేస్తే.. భూమితో పాటు ఇతర రాయితీలు ఇవ్వడానికి ఏపీ సర్కారు సిద్ధంగా ఉంది. బెంగళూరులో రోజర్ బిన్నీ అకాడమీ ఎప్పటి నుంచో ఉన్నా.. అనిల్ కుంబ్లే మరో క్రికెట్ అకాడమీని స్టార్ట్ చేశారు. ఇవే కాకుండా పేస్ బౌలర్లకు శిక్షణ కోసం ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ కూడా బెంగళూరు కేంద్రంగా నడుస్తోంది.
బెంగళూరు తరహాలోనే అమరావతిలో కూడా క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే క్రికెటర్లను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. మరోవైపు ఎంఎస్ ధోనీని రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తారని మరో ప్రచారం జరుగుతోంది. గతంలో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును టీడీపీ ప్రభుత్వం స్వచ్చాంద్ర మిషన్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ప్రస్తుతం కూటమి పాలనలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడుల్లో దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో ధోనీని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం ద్వారా ఏపీ విజయాలు మన దేశంతో పాటు విదేశాల్లోనూ ప్రాచుర్యం పొందే అవకాశం ఉంటుంది.
