గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన 129వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పార్టీ నాయకులతో కలిసి వీక్షించారు.
ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో భారతదేశం సాధించిన అద్భుత విజయాలను ప్రధాని ఈ కార్యక్రమంలో గుర్తుచేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా క్రీడారంగంలో భారత పురుషుల క్రికెట్ జట్టు కొత్త ఆశలు, సంకల్పంతో 2026లోకి అడుగుపెడుతోందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారని తెలిపారు.
మహిళల క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ గెలవడమే కాకుండా, మహిళల అంధుల టీ20 ప్రపంచకప్లోనూ భారత క్రీడాకారులు విజయం సాధించి చరిత్ర సృష్టించడాన్ని ప్రధాని కొనియాడారని వివరించారు.
అలాగే, సైనిక రంగంలో ‘ఆపరేషన్ సిందూర్ 2025’ ద్వారా భారత్ సాధించిన విజయాన్ని మారుతున్న భారతావనికి నిదర్శనంగా ప్రధాని అభివర్ణించారని, ఈ విజయం దేశవ్యాప్తంగా దేశభక్తిని పెంపొందించిందని రామాంజనేయులు గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్ రావ్, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు అనిల్, మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, శ్రీనివాసులు, బీజేపీ నాయకులు రఘు గౌడ్, మోహన్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
