ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరదాగా బీచ్కు వెళ్లిన స్నేహితుల బృందంలో ఇద్దరు యువకులు సముద్ర అలల్లో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పెదజాలరిపేటకు చెందిన చురకాల నీతు (19), రాము మరో ఐదుగురు స్నేహితులతో కలిసి పాత గంగవరం బీచ్కు వెళ్లారు. అక్కడ స్నేహితులంతా సముద్రం ఒడ్డున నిలబడి ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా భారీ అల వచ్చి వారిని కమ్మేసింది.
ఈ ఘటనలో చురకాల నీతు సముద్రంలోకి కొట్టుకుపోయారు. ఆమెను రక్షించేందుకు ప్రయత్నించిన రాము కూడా అలల్లో చిక్కుకుని గల్లంతయ్యారు. మిగిలిన స్నేహితులు వెంటనే బయటపడగా, ఈ ఇద్దరూ కనిపించకుండా పోయారు. సమాచారం అందుకున్న న్యూ పోర్ట్ పోలీసులు, గజ ఈతగాళ్లు, సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
సముద్రంలో గాలింపు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రెండ్షిప్ డే వేడుకల సందర్భంగా ఆనందంగా గడపాలని వెళ్లిన యువతలో ఈ విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ప్రమాదకర ప్రాంతాల్లో సముద్రంలోకి వెళ్లకుండా, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
