దేశంలో మెడికల్ సీట్లు భారీ ఎత్తున పెరకబోతున్నాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. భారతదేశంలో వైద్య విద్య విస్తరణకు నేషనల్ మెడికల్ కమిషన్ అండర్గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్-2023లో ముఖ్య మార్పులు చేసింది.
ఈ సవరణలతో కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు మార్గం సుగమం కావడంతో పాటు ఇప్పటికే ఉన్న కాలేజీల్లో సీట్ల పెంపుకు అవకాశం కలుగుతోంది. ఇప్పటివరకు ఒక మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు గరిష్టంగా 150కే పరిమితం చేసే నిబంధనను 2024–25 విద్యా సంవత్సరానికి ముందు అమల్లో ఉంచారు.
తాజా నిర్ణయంతో ఆ పరిమితిని పూర్తిగా తొలగించారు. దీంతో అవసరమైన ఇతర ప్రమాణాలు నెరవేర్చిన కాలేజీలు తమ సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకునే అవకాశం పొందాయి. అలాగే రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రతి 10 లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్లు ఉండాలనే నిబంధనను కూడా రద్దు చేశారు.
ఈ మార్పుతో రాష్ట్రాలపై ఉన్న పరిమితులు తగ్గి, వైద్య విద్యా మౌలిక వసతుల విస్తరణకు అడ్డంకులు తొలగనున్నాయి. ఇంకా ఒక ముఖ్యమైన సవరణగా, మెడికల్ కాలేజీకి అనుబంధ ఆసుపత్రి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉండాలనే నిబంధనను తొలగించి, దాని స్థానంలో గరిష్టంగా 10 కిలోమీటర్ల దూరం ఉండాలని కొత్త ప్రమాణం తీసుకొచ్చారు.
ఈశాన్య మరియు హిమాలయ ప్రాంత రాష్ట్రాల కోసం ఈ దూరాన్ని 15 కిలోమీటర్ల వరకు సడలించారు, అక్కడి భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019 కింద జారీ చేసిన ఈ మార్పులు దేశంలో పెరుగుతున్న ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు వైద్య విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగం కూడా కొత్త మెడికల్ కాలేజీల స్థాపనకు ముందుకు వచ్చే అవకాశాలు ఈ నిర్ణయంతో పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
