తెలుగుదేశం పార్టీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. యువరక్తానికి పార్టీ నాయకత్వ బాధత్యలు అప్పగించడానికి అధికారికంగా అడుగులు పడుతున్నాయి. 252 మందితో కూడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో.. నారా లోకేశ్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతలను భుజాలకెత్తుకొని.. పార్టీకి దిశా నిర్దేశం చేసి.. కార్యకర్తల సంక్షేమం కోసం.. లోకేశ్ పడ్డ శ్రమను గుర్తించి ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అనేది కేవలం నినాదం కాదని పార్టీ విధానమని.. కమిటీల కూర్పు ద్వారా చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక మండల స్థాయి నాయకురాలికి పోలిట్బ్యూరో చోటు కల్పించడం, రామ్మోహన్నాయుడు, బైరెడ్డి శబరి వంటి యువ నేతలను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించడం పార్టీలో జరుగుతున్న మార్పులను సూచిస్తున్నాయి.
ఉన్నత విద్యావంతులుకు.. ప్రజల కోసం కష్టపడే వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతను పాటిస్తూ.. సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే, యువతకు పెద్ద పీట వేయడం ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. లోకేశ్ సారధ్యంలోని కొత్త టీమ్.. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన వారధిలా పని చేయాల్సి ఉంటుంది.
పార్టీ కొత్త కార్యవర్గానికి ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర పురోగతి కోసం చేస్తున్న కార్యక్రమాలను చంద్రబాబు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అప్పుల ఊబిలో కూరుకుపోయి.. వెంటిలేటర్ మీదున్న ఆర్ధిక వ్యవస్థకు కేంద్ర సహకారంతో కొత్త ఊపిరి పోస్తున్నామని చెప్పారు.
సూపర్ సిక్స్ హామీలను విజయవంతంగా అమలు చేస్తూ.. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసిన వైనాన్ని తెలియజేశారు. ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి.. లోకేశ్ కృషితో 20 లక్షల ఉద్యోగాల కల్పన సాకారం అయ్యే దిశగా ముందుకు సాగుతున్నారు.
పదవి అలంకారం కాదు.. బాధ్యత. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని పటిష్టం చేయడం ఇప్పుడు లోకేశ్ ముందున్న పెద్ద సవాల్. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన లోకేశ్.. పరిపాలన దక్షతతో ప్రభుత్వంలో సాధించిన విజయాలను… పార్టీ వ్యవహారాల్లోనూ రిపీట్ చేయాల్సి ఉంటుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును నిర్దేశించే మైలురాయిగా నిలిచిపోతుంది.
