విజయవాడలో ఈ నెల 15న ‘జాతీయ ఆరోగ్య రంగం-కృత్రిమ మేధ వినియోగ విధానం రూపకల్పన-సంబంధిత విభాగాల భాగస్వామ్యం’ సదస్సు ఉన్నత స్థాయిలో జరుగనుందని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ నేడొక ప్రకటనలో తెలిపారు.
ఏపీతో కలిపి 7 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహణ ఏర్పాట్ల కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ 10 ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేసిందని తెలిపారు. ఆరోగ్య రంగంలో కృతిమ మేధ (Artificial Intelligence) ఎలా ఉండాలన్న దానిపై ఈ సదస్సు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.
ఈ సదస్సులో రాష్ట్ర అధికారులతోపాటు ఒడిశ్శా, చత్తీస్ ఘడ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్ ఐల్యాండ్, లక్షద్వీప్, పుదుచ్చేరిలోని వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ శాఖల కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్లు సదస్సులో పాల్గొంటారు.
ఢిల్లీలో జాతీయ సదస్సు….
ఆరోగ్య రంగంలో ఐటీకి అనుసంధానంగా ‘కృత్రిమ మేధ’ ను వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా జాతీయ స్థాయిలో ఓ ముసాయిదా రూపకల్పనకు కేంద్ర ఐటీ శాఖ సిద్ధమైంది. అమెరికా, ఫ్రాన్స్, యూరప్ లో కొన్ని దేశాలు ఇప్పటికే ఏఐ స్ట్రాటజీని రూపొందించాయి.
ఇదేవిధంగా భారత్ లోనూ తయారు చేసేందుకు వీలుగా దేశంలో ఎంపికచేసిన 5 రాష్ట్రాల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి. వాటిల్లో పాల్గొనే సదరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ శాఖల కార్యదర్శులు, జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్టర్లు, నిపుణుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 26 నుంచి 28వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే ‘ఏఐ ఇంపాక్ట్ సమిట్ ఫర్ హెల్త్’ జాతీయ సదస్సులో ప్రాంతీయ సదస్సుల ద్వారా వచ్చిన అభిప్రాయాలపై చర్చించి ముసాయిదా రూపొందిస్తారని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వీరపాండియన్ తెలిపారు.
ఐదు అంశాలపై ప్రధానంగా చర్చ
దక్షిణాది సదస్సులో ప్రధానంగా డేటా అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నెస్ అండ్ ఎథిక్స్, పాలసీస్, వర్క్ఫోర్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఎవిడెన్స్ జనరేషన్, హెల్త్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ ఇంపాక్ట్ అంశాలపై సదరు శాఖల అధికారులు తమ అభిప్రాయాలను తెలియచేస్తారు.
ప్రస్తుతం ఆరోగ్య రంగంలో ఐటీ వినియోగం ఎలా ఉంది? వాటివల్ల కనిపిస్తున్న ఫలితాలు, ఇంకా తీసుకోవాల్సిన చర్యలు, ఏఐ వినియోగంతో చేకూరే ప్రయోజనాలపై ఈ కార్యశాలలో విస్తృతంగా చర్చిస్తారు ఐఐటీ, ఎన్ఐటీ, ఇతర జాతీయ సంస్థల విద్యావేత్తలను కూడా సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానాలు పంపారు.
ఈ సదస్సు నిర్వహణలో డబ్ల్యూహెచ్, ఐసీఎంఆర్, కేంద్ర ఐటీ శాఖలు భాగస్వాములు అవుతున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగే ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటుచేసిన కమిటీలు అవసరమైన చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యాయి.
