దేశంలో సామాన్యుడిపై మరోసారి నిత్యావసరాల భారం పడింది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం, పశ్చిమాసియా (యుఎస్-ఇరాన్) యుద్ధ వాతావరణం కారణంగా దేశీయ వంటగ్యాస్ (ఎల్పీజీ) ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయి.
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కు చేరింది. హైదరాబాద్లో దీని ధర సుమారు రూ. 994 దాటింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైన తర్వాత గత మూడు నెలల వ్యవధిలో గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి. అంతకుముందు మార్చిలో సిలిండర్ ధరపై రూ. 60 మేర పెంచిన సంగతి తెలిసిందే. వీటితో పాటు గత కొన్ని వారాలుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 7.50 వరకు, అలాగే సీఎన్జీ ధరలు కిలోకు రూ. 6 వరకు పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్లో సౌదీ కాంట్రాక్ట్ ధరలు భారీగా పెరగడం, గ్లోబల్ ఎనర్జీ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వల్లే ఈ ధరల సవరణ అనివార్యమైందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పెంపుదల తర్వాత కూడా చమురు కంపెనీలు దేశీయ గ్యాస్ విక్రయాలపై కొంత మేర నష్టాలను భరిస్తున్నాయని, అంతర్జాతీయ మార్కెట్ భారమంతటినీ వినియోగదారులపై వేయకుండా ప్రభుత్వం కొంత మేర నియంత్రిస్తోందని అధికారులు పేర్కొన్నారు. అయినప్పటికీ వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
