ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో నవ శకాన్ని ఆవిష్కరిస్తూ విశాఖపట్నం నగరం ఆసియా ఖండానికే AI గేట్వేగా అవతరించనుంది. దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అత్యంత ఆధునిక AI డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుండటంతో, అంతర్జాతీయ టెక్ మ్యాప్లో విశాఖ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోబోతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్నారు.
గూగుల్ సంస్థ సుమారు 1.35 లక్షల కోట్ల భారీ వ్యయంతో 1,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ను నిర్మించనుంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లే ఇంతటి భారీ పెట్టుబడి సాకారమైందని ప్రభుత్వం వెల్లడించింది. తర్లువాడ, అడవివరం, రాంబిల్లి ప్రాంతాల్లో సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు కానుంది. దీని ద్వారా డేటా స్టోరేజీతో పాటు అత్యాధునిక AI క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి రానుంది.
విశాఖ తీరప్రాంతం కావడం ఈ ప్రాజెక్టుకు ప్రధాన బలంగా మారింది. సముద్ర గర్భం ద్వారా వచ్చే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఇక్కడి వాతావరణం ఎంతో అనుకూలం. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ కేబుల్ వ్యవస్థ ద్వారా విశాఖ నగరం వివిధ ప్రపంచ దేశాలతో నేరుగా అనుసంధానం కానుంది. ఈ ప్రాజెక్టులో అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.
కేవలం విశాఖకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 6.5 గిగావాట్ల సామర్థ్యంతో మల్టీ గిగావాట్ డిజిటల్ హబ్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ డేటా సెంటర్ల ద్వారా లభించే ఆదాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేయనుంది. ఐటీ ఉద్యోగాల కల్పనతో పాటు, అనుబంధ రంగాల్లో కూడా భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.
