రోజు రోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఏపీలో విద్యుత్ బిల్లులు భారీగా తగ్గించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. వచ్చే మూడేళ్లలో యూనిట్కు ఒక రూపాయి 19 పైసల వరకు కరెంటు ఛార్జీలను తక్కువ చేయాలనే టార్గెట్తో ఏపీ ఇంధన శాఖ పని చేస్తోంది. ప్రస్తుతం ఒక యూనిట్కు సరాసరి 5 రూపాయల 19 పైసలు వసూలు చేస్తున్నారు. యూనిట్ సగటు వ్యయాన్ని 4 రూపాయలకు తీసుకురావాలన్నది కూటమి సర్కార్ ప్లాన్. ఇందుకోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశారు.
ట్రాన్స్మిషన్ నష్టాలు తగ్గించడం, విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెంచడం, పీక్ టైమ్లో భారీ రెట్లకు కొనే కరెంటును తగ్గించడం.. వంటి చర్యల ద్వారా.. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో డిమాండ్కి తగ్గ ఉత్పత్తి సాధించలేకపోవడంతో అధిక ధరలకు బయట నుంచి కొనాల్సి వచ్చేది. ఇప్పుడు సొంత ధర్మల్, హైడెల్ పవర్ ప్లాంట్లను పూర్తి సామర్ధ్యంతో నడపుతూ.. సోలార్ పవర్తో.. స్థానికంగానే అవసరానికి సరిపడా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. లేటెస్ట్ టెక్నాలజీతో డిమాండ్ను అంచనా వేసి.. సరఫరాను మేనేజ్ చేయడం ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలు.. ఇప్పటికే 2 వేల 300 కోట్లు ఆదా చేశాయని గణాంకాలు చెబుతున్నాయి.
పవర్ ప్లాంట్ నుంచి వినియోగదారుడికి చేరే వరకు పంపిణీలో అంటే తీగల మీదే 10 శాతం కరెంటు నష్టం జరుగుతుంది. ఈ పంపిణీ నష్టాల్లో ఒక్క శాతం తగ్గించగలిగినా ఏడాదికి వెయ్యి కోట్లు సేవ్ అవుతాయి. విజయవాడ, కృష్ణపట్నం, కడప ధర్మల్ ప్లాంట్లలో నాణ్యమైన బొగ్గును వినియోగించడం ద్వారా.. పవర్ ప్లాంట్ సామర్ధ్యం పెరగడంతో ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో ఏపీలో సోలార్ పవర్ ప్రొడక్షన్ భారీగా పెరుగుతోంది.
చవకయిన సౌర విద్యుత్ని బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ విధానాలతో సాయంత్రం వేళ పీక్ లోడ్ ఉన్న సమయంలో సరఫరా చేయగలిగితే.. కరెంటు ఛార్జీలు మరింత తగ్గుతాయి. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రభుత్వం ఎవరి ఇళ్లపై వారు సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి భారీగా సబ్సిడీలు ఇస్తోంది. ఈ పథకం ద్వారా 4 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగితే.. ఆ మేరకు పంపిణీ నష్టాలు నివారించడంతో పాటు ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ఇవన్నీ ప్లాన్ ప్రకారం చేస్తే.. రెండేళ్లలోనే యూనిట్ సగటు ధరను 4 రూపాయలకు తీసుకురావొచ్చు.
