నీటిపారుదల రంగంలో అత్యంత కీలకమైన కాలువల వ్యవస్థ నిర్వహణకు గాను రూ. 397 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఈ పనులన్నీ వచ్చే ఖరీఫ్ కు ముందే పూర్తి చేసి తీరుతామన్నారు. ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో కేవలం 200 కోట్లు మాత్రమే కాలువల నిర్వహణ, పూడికతీత వంటి పనులకు కేటాయించిన వైనాన్ని మంత్రి ఎండగట్టారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో ఓ అండ్ ఎం పనులకు రూ.1100 కోట్లు కేటాయించి అన్నదాతల పట్ల తమ బాధ్యత నెరవేర్చిందన్నారు. ఓ అండ్ ఎం నిధులతో తూడు, గుర్రపుడెక్క తొలగింపు, నీటి అడ్డంకులు తొలగింపు, పూడిక తీత పనుల కోసం ఖర్చు చేస్తారన్నారు. వెంటనే పనులు మొదలు పెట్టేలా సిఈ స్దాయి నుండి కింది స్దాయి అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. సీజన్ మొదలయ్యేలోగా కాలువల పూడికతీత, తవ్వకం, తూడు, గుర్రపుడెక్క తొలగింపు వంటి అత్యవసర పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
రూ.10లక్షల లోపు పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో నామినేషన్ పద్దతిలో చేపట్టవచ్చు అని, రూ.10లక్షలు దాటిన పనులకు షార్ట్ టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలన్నారు. అలాగే గేట్లు, షట్టర్లు, వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి, సక్రమంగా పనిచేసే స్దితిలో ఉన్నాయనే ధ్రువీకరణ పత్రాన్ని, చీఫ్ ఇంజనీర్ కు ఇవ్వాలన్నారు.
సాగు నీటి సంఘాల ఆధ్వర్యంలో, వారి పరిధిలోని పనులను, మే నెలాఖరుకు పూర్తిచేయాలని చెప్పారు. పనులను సకాలంలో పూర్తిచేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరిండెంట్ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. గత 5ఏళ్ళ వైసిపి ప్రభుత్వం కాలువల నిర్వహణ, మరమ్మత్తులు, పూడికతీత పనులను గాలికి వదిలేయడం వల్ల ఇరిగేషన్ వ్యవస్థ నాశనమైందని, కూటమి ప్రభుత్వం, గాడిలోపెడుతుందని అన్నారు.
